Green Card: గ్రీన్‌ కార్డు అర్హత నిబంధనలను సరళీకరించిన అమెరికా

అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకున్న విదేశీయులకు జారీ చేసే గ్రీన్‌ కార్డు అర్హత నిబంధనలను సరళతరం చేసింది.

Published : 17 Jun 2023 19:08 IST

వాషింగ్టన్‌: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు కొద్ది రోజుల ముందు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు అక్కడ శాశ్వత నివాసం కోసం జారీ చేసే గ్రీన్‌ కార్డు (Green Card) అర్హత నిబంధనలను సరళతరం చేసింది.. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో అమెరికాలో స్థిరపడాలని ఆశిస్తున్న వేలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆహ్వానం మేరకు ఈ నెల 21 నుంచి 24 మధ్య మోదీ అమెరికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అమెరికా కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలోనూ ఆయన ప్రసంగించనున్నారు. మోదీ గౌరవ సూచికంగా వైట్‌హౌస్‌లో బైడెన్‌ దంపతులు స్టేట్‌ డిన్నర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.  

గ్రీన్‌ కార్డుల జారీ విషయంలో తాజాగా అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) జారీ చేసిన మార్గదర్శకాలు భారతీయ సాంకేతిక నిపుణులకు  ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పలువురు భావిస్తున్నారు. అమెరికాలో స్థిరపడాలన్న వారని కోరికను సాకారం చేసుకునేందుకు దోహదం చేస్తాయని అంటున్నారు. గ్రీన్‌ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కాకుండా రెన్యువల్ చేసుకునే వారికి కూడా నూతన మార్గదర్శకాలు వర్తింపచేయనున్నట్లు అమెరికా వెల్లడించింది.

ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లి అక్కడే శాశ్వతంగా స్థిరపడాలనుకునే వలసదారులకు అమెరికా పర్మనెంట్‌ రెసిడెంట్‌ కార్డ్ (గ్రీన్‌ కార్డు)లను ఇస్తుంటుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్‌ చట్టం ప్రకారం.. ప్రతియేటా సుమారు 1,40,000  గ్రీన్‌ కార్డులను జారీ చేస్తుంది. అయితే, ఒక్కో దేశానికి నిర్ణీత సంఖ్య (కోటా)లో మాత్రమే వీటిని జారీ చేస్తుంటారు. మొత్తం దరఖాస్తుల్లో ఒక్కో దేశానికి కేవలం 7% మాత్రమే కేటాయించాలన్నది ప్రస్తుత విధానం. ఈఏడీ అర్హతలు ఉన్నవారికి మాత్రమే  ప్రస్తుతం గ్రీన్‌ కార్డు జారీ చేస్తున్నారు. తాజాగా ఈఏడీ నిబంధనలను సడలించిన నేపథ్యంలో అమెరికాలో సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు మద్దతిచ్చినట్లవుతుందని వలసదారుల హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాది అజయ్‌ భూటోరియా తెలిపారు. అమెరికాలో చట్టబద్ధంగా పని చేసే వారి సంఖ్యను పెంపొందించేందుకు తాజా నిర్ణయం దోహదం చేస్తుందని ఆయన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని