Ukraine War: బక్ముత్‌ నగరంపై వాగ్నర్‌ పట్టు..?

ఉక్రెయిన్‌కు కీలకమైన బక్ముత్‌పై పోరు తీవ్రమైంది. ఇప్పటికే ఈ నగరాన్ని తాము ఆక్రమించుకొన్నట్లు వాగ్నర్‌ గ్రూప్‌ ప్రకటించింది. 

Updated : 03 Apr 2023 16:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా(Russia)తో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌(Ukraine )కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. రష్యా దళాలు మరింత ముందుకొచ్చేందుకు ఇప్పుడు అవకాశం లభించింది. ఈ పోరులో కీలకమైన బక్ముత్‌ నగరాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు క్రెమ్లిన్‌ కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ ప్రకటించింది. ఈ మేరకు రాత్రివేళ నగర సిటీ హాల్‌లో రష్యా పతాకాన్ని  ఎగురవేసినట్లు పేర్కొంది. ఆ గ్రూప్‌ అధిపతి ప్రిగోజిన్‌ ఓ వీడియోలో మాట్లాడుతూ బక్ముత్‌ ఇక అధికారికంగా రష్యా సొంతమైనట్లు పేర్కొన్నారు. అయితే పశ్చిమ ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ దళాలు బలంగా ఉన్నట్లు అంగీకరించారు. 

మరోవైపు ఈ వీడియోను ఉక్రెయిన్‌ అధికారులు  తోసిపుచ్చారు. ఇప్పటికీ ఈ నగరం తమ ఆధీనంలో ఉన్నట్లు వెల్లడించారు. ‘‘శత్రువులు బక్ముత్‌పై దాడులను ఆపడంలేదు. కానీ, ఉక్రెయిన్‌ రక్షకులు ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ వాటికి దీటుగా సమాధానం ఇస్తున్నారు’’ అని ఉక్రెయిన్‌ సైనిక దళాల జనరల్‌ స్టాఫ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అక్కడ జరుగుతున్న పోరుపై ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ వార్‌’ అంచనాల ప్రకారం బక్ముత్‌లో ఎక్కువ ప్రదేశం ఉక్రెయిన్‌ ఆధీనంలోనే ఉంది. కానీ, రష్యా సేనలు తూర్పు దక్షిణ దిశలుగా కమ్ముకొస్తున్నాయి. తూర్పు వైపు నుంచి చేసిన దాడులతో సిటీహాల్‌ భవనాన్ని ఆక్రమించుకొంది. ఇక్కడ జరిగే పోరులో వాగ్నర్‌ గ్రూప్‌ భారీగా నష్టాలను చవిచూసిందని వెల్లడించారు. ఈ గ్రూప్‌తోపాటు రష్యా దళాలు కూడా భారీగా పోరాడుతున్నాయి. ఉక్రెయిన్‌ దళాలు ఇక్కడ అద్భుతంగా పోరాడుతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం అభినందించారు.

దాదాపు 70,000 మంది ప్రజలున్న బక్ముత్‌ నగరం పై గతేడాది రష్యా దాడులు మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ఇక్కడ పోరాటం ఆగలేదు. తాజాగా ప్రిగోజిన్‌ ప్రకటనపై అనుమానాలు ఉన్నాయి. అతడు గతంలో యుద్ధం పూర్తికాక ముందే ప్రకటనలు చేశాడు. ఉప్పు గనుల నగరం సొలెడార్‌ ఆక్రమణ సమయంలో కూడా ప్రిగోజిన్‌ ప్రకటనలు గందరగోళం సృష్టించాయి. బక్ముత్‌ నగరం ఉక్రెయిన్‌ చేజారితే రష్యా బలగాలు మరింత ముందుకెళ్లే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించారు. దొనెట్స్క్‌ దిశగా బక్ముత్‌ నుంచి ఇతర నగరాలకు చొచ్చుకొనిపోవడానికి వారికి సులువవుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని