United Nations: ఏం చేయాలో భారత్‌కు తెలుసు..! మాకు ఎవరో చెప్పాల్సిన అవసరంలేదు..!

ప్రజాస్వామ్యంపై భారత్‌కు మరొకరు చెప్పాల్సిన అవసరం లేదని ఐరాసలో మన దేశ ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ పేర్కొన్నారు.

Updated : 02 Dec 2022 11:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రజాస్వామ్య దేశంలో ఏం చేయాలో తమకు స్పష్టంగా తెలుసని ఐరాసలో భారత రాయబారి రుచిరా కాంబోజ్‌ చెప్పారు. ఐరాస భద్రతా మండలిలో డిసెంబర్‌ నెలకు భారత్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రుచిరా నెల రోజుల భారత ప్రణాళికపై విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు భారత్‌లో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛపై ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఏం చేయాలో తమకు మరొకరు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. 

‘‘భారత్‌ ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికత ఉన్న దేశమని మీ అందరికీ తెలుసు. ఇక్కడ ప్రజాస్వామ్యం వేళ్లు 2,500 ఏళ్ల క్రితమే నాటుకొన్నాయి. మాది ఎప్పుడూ ప్రజాస్వామ్య దేశమే. ఇక ఇటీవల కాలానికొస్తే.. ప్రజాస్వామ్యానికి అవసరమైన  శాసన,కార్యనిర్వాహక, న్యాయ, ప్రెస్‌ రూపంలో నాలుగు మూలస్తంభాలు ఉన్నాయి. అత్యంత చురుకైనా సోషల్‌ మీడియా కూడా ఉంది. అందుకే భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతోంది’’ అని రుచిరా కాంబోజ్‌ వివరించారు.

‘‘ప్రతి ఐదేళ్లకోసారి ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరికి వారి అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉండేలా మా వ్యవస్థ పనిచేస్తుంది. మా దేశంలో వేగంగా సంస్కరణలు చేపడుతూ..  మార్పులు తీసుకొస్తున్నాం. ఈ విషయాన్ని నేను చెప్పాల్సిన.. మీరు వినాల్సిన అవసరం లేదు’’ అని భారత్‌లోని మార్పులను రుచిరా వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ నాయకత్వంలో ఐరాస భద్రతా మండలిలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెలతో ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్‌ సమయం ముగియనుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని