NeoCoV: నియో కోవ్‌ వైరస్‌పై డబ్ల్యూహెచ్‌వో ఏమంటోంది?

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న వేళ దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో ప్రమాదకర నియో కోవ్‌ (NeoCoV) వైరస్‌ ఉన్నట్టు తేలిన పరిశోధనలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).....

Published : 29 Jan 2022 02:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న వేళ దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో ప్రమాదకర నియో కోవ్‌ (NeoCoV) వైరస్‌ ఉన్నట్టు తేలిన పరిశోధనలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పందించింది. చైనాలోని వుహాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ కొత్త రకం కరోనా వైరస్‌పై మరింత అధ్యయనం అవసరం అని తెలిపింది. గబ్బిలాల్లో ‘నియో కోవ్‌’ ఉన్నట్టు వుహాన్‌ పరిశోధకులు గుర్తించిన విషయం తమకు తెలిసిందని, అయితే, ఈ వైరస్‌ వల్ల మనుషులకు ముప్పు ఉంటుందా? లేదా అనే విషయం తెలుసుకొనేందుకు మరింత అధ్యయనం అవసరమని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నట్టు రష్యా న్యూస్‌ ఏజెన్సీ టాస్‌ పేర్కొంది.

మనుషుల్లో వచ్చే 75 శాతం అంటువ్యాధులకు మూలం జంతువులేనని, మరీ ముఖ్యంగా వన్యప్రాణులని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. జంతువులతో పాటు గబ్బిలాల్లోనూ కరోనా వైరస్‌ ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే జునోటిక్‌ వైరస్‌లను ఎదుర్కోవడంలో తాము అత్యంత చురుగ్గా పనిచేస్తున్నట్టు వెల్లడించింది. ఈ పరిశోధన ఫలితాలను పంచుకున్న చైనా పరిశోధకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.

మరోవైపు, దక్షిణాఫ్రికాలో బయటపడిన ‘నియో కోవ్‌ (NeoCoV)’ అనే కొత్త రకం వైరస్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటు మరణాల రేటు కూడా అధికంగానే ఉండే అవకాశముందని తెలుస్తోంది. కొవిడ్‌ 19తో పోలిస్తే ‘నియో కోవ్‌’ వైరస్‌ కాస్త భిన్నమైనదే గాక, ప్రమాదకరమైనదని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యాంటీబాడీలు, కొవిడ్‌ 19 వ్యాక్సిన్లు కూడా దీనికి పనిచేయకపోవచ్చని చెబుతున్నారు. 2012, 2015లో మధ్య ప్రాశ్చ్య దేశాల్లో విజృంభించిన మెర్స్‌ - కోవ్‌ మాదిరిగా ‘నియో కోవ్‌’తో అధిక మరణాలు ఉండొచ్చని హెచ్చరించారు. ఈ వైరస్‌ మనుషులకు వ్యాపిస్తే.. సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రాణాపాయం తప్పదని అంటున్నారు. ఇక సార్స్‌ కోవ్- 2 మాదిరిగా వేగంగా మనుషులకు సోకే ప్రమాదం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు