Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’

పశ్చిమ దేశాల నుంచి నెలకొన్న తీవ్ర రాజకీయ, ఆర్థిక ఒత్తిడుల కారణంగానే రష్యా అణ్వాయుధాలకు చోటు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని బెలారస్‌ వెల్లడించింది. వాటిపై మిన్‌స్క్‌ ఎటువంటి నియంత్రణ కలిగి ఉండదని తెలిపింది.

Published : 29 Mar 2023 01:37 IST

మిన్‌స్క్‌: బెలారస్‌ (Belarus)లో వ్యూహాత్మక అణ్వాయుధాల (Tactical Nuclear Weapons)ను మోహరించనున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. పాశ్చాత్య దేశాల (Western Countries) నుంచి ఎదురవుతోన్న తీవ్ర ఒత్తిడి కారణంగానే తమ దేశంలో రష్యా (Russia) అణ్వాయుధాల మోహరింపునకు ముందుకొచ్చినట్లు బెలారస్‌ తాజాగా వెల్లడించింది. ఈ విషయంలో ఎటువంటి అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది.

‘అమెరికా, దాని మిత్రదేశాల నుంచి బెలారస్‌పై తీవ్ర రాజకీయ, ఆర్థికపరమైన ఒత్తిడి నెలకొంది. ఈ క్రమంలోనే.. దేశ భద్రత, రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’ అని బెలారస్‌ విదేశాంగ శాఖ తెలిపింది. రష్యన్‌ అణ్వాయుధాలపై బెలారస్ ఎటువంటి నియంత్రణ కలిగి ఉండదని, పైగా.. వాటి మోహరింపు అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని(NPT) ఏ విధంగానూ ఉల్లంఘించలేదని పేర్కొంది.

ఇదిలా ఉండగా.. సైనిక చర్య క్రమంలో ఉక్రెయిన్‌పై దాడులకుగానూ తమ భూభాగాన్ని స్థావరంగా వాడుకునేందుకు రష్యాకు బెలారస్‌ అనుమతి ఇచ్చింది. బెలారస్, రష్యాలు స్థానికంగా సైనిక కసరత్తులూ నిర్వహించాయి. సైన్యాల మధ్య పరస్పర సహకారాన్ని పెంచుకున్నాయి. అయితే, రష్యాతో సైనిక భాగస్వామ్యం.. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే కొనసాగుతోందని బెలారస్‌ విదేశాంగ శాఖ తెలిపింది.

బెలారస్‌లో వ్యూహాత్మక అణ్వాయుధాలను దాచి పెట్టే యూనిట్ల నిర్మాణం జులై 1 నాటికి పూర్తవుతుందని పుతిన్‌ ఇటీవల తెలిపారు. సంప్రదాయ ఆయుధాలు సహా అణ్వస్త్రాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న ‘ఇస్కందర్‌’ అనే స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థను ఇప్పటికే బెలారస్‌కు పంపినట్లు వెల్లడించారు. ఐరోపాలోని పలు దేశాల్లో నాటో కూటమి ఇప్పటికే అణ్వాయుధాలను మోహరించింది. దానికి వ్యతిరేకంగానే పుతిన్‌ తాజాగా ఈ చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని