G-20: ఈసారి జీ-20 సదస్సులో ఫ్యామిలీ ఫొటో మిస్‌..!

రష్యా అధ్యక్షుడు పుతిన్ జీ 20 సమావేశాలకు హాజరు కావడం లేదని ఇప్పటికే ప్రకటన వెలువడింది. అయితే ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ హాజరవుతున్నారు.

Published : 13 Nov 2022 01:39 IST

బాలి: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వ్యతిరేకత చూపుతున్నాయి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ జీ-20 సదస్సులో కూడా కనిపించనుంది. అందుకే వచ్చే వారం జరగనున్న సమావేశంలో ఫ్యామిలీ ఫొటో దిగొద్దని ప్రపంచ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సదస్సు మొదలుపెట్టే ముందు ఈ నేతలంతా ఒకదగ్గర నిల్చొని ఫొటోకు పోజు ఇస్తారు. అయితే ఈసారి అది మిస్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

రష్యా చేపడుతోన్న ప్రత్యేక ఆపరేషన్‌పై వస్తోన్న వ్యతిరేకత నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదని ఇప్పటికే ప్రకటన వెలువడింది. అయితే ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ హాజరవుతున్నారు. ఈ యుద్ధం సమయంలోనే ఇదివరకు జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచ ఆహార సంక్షోభానికి ఈ దాడి కారణం కాదని లావ్రోవ్‌ వాదించారు. ఆ మాట చెప్పి మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.  

ఇదిలా ఉంటే.. ఈ సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు  జెలెన్‌స్కీని వర్చువల్‌గా ప్రసంగించాలని కోరగా.. పుతిన్‌ వస్తే, తాను ఇందులో భాగంకానని ఆయన వెల్లడించారు. అలాగే రష్యా జీ-20లో భాగంగా ఉంటే, పలు అంశాలపై ఏకాభిప్రాయానికి రావడం వీలుకాకపోవచ్చని బ్రిటన్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఇక ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా పేరుగాంచిన జీ-20 పాలనా పగ్గాలను డిసెంబరు 1న ఇండోనేషియా నుంచి భారత్‌ స్వీకరించనుంది. ఈ కూటమిలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, అమెరికా, ఐరోపా సమాజం(యూరోపియన్‌ యూనియన్‌) సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ సమావేశం ఈ నెల 15-16 తేదీల్లో ఇండోనేషియాలోని బాలిలో జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని