S Jaishankar: పెరట్లో పామును పెంచి.. పక్కవారినే కాటేయాలంటే ఎలా..?
అంతర్జాతీయ వేదికపై భారత్ను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించిన పాకిస్థాన్కు మరోసారి భంగపాటు తప్పలేదు. దిల్లీపై తప్పుడు ఆరోపణలు చేసి నోరు పారేసుకున్న దాయాదికి భారత విదేశాంగమంత్రి జైశంకర్ గట్టిగా బుద్ధిచెప్పారు.
యునైటెడ్ నేషన్స్: అంతర్జాతీయ వేదికగా దాయాది పాకిస్థాన్ (Pakistan) ఆగడాలను భారత్ మరోసారి ఎండగట్టింది. ఉగ్రవాదం ముప్పు ఎక్కడి నుంచి మొదలైందో ఈ ప్రపంచం మర్చిపోలేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) అన్నారు. ఇకనైనా ఆ దేశం తమ చేష్టలను మార్చుకుని, పొరుగు దేశాల పట్ల స్నేహంగా ఉండాలని హితవు పలికారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఓసారి పాకిస్థాన్పై చేసిన ‘పాము’ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. దాయాదిపై నిప్పులు చెరిగారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ ప్రపంచం అవలంభించాల్సిన విధానాలపై ఐరాస (United Nations) భద్రతా మండలిలో భారత్ అధ్యక్షతన చర్చ జరిగింది. ఈ సమావేశం అనంతరం జైశంకర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల పాకిస్థాన్ మంత్రి ఒకరు భారత్ను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల పై మీడియా జైశంకర్ను ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ.. ‘‘ఆ మంత్రి అన్న వ్యాఖ్యలు నేను కూడా విన్నాను. ఇక్కడో విషయం వారికి గుర్తుచేయాలి. ఓ దశాబ్దం క్రితం హిల్లరీ క్లింటన్ పాకిస్థాన్లో పర్యటించారు. ఆ సమయంలో ఆమె పాకిస్థాన్ను ఉద్దేశిస్తూ.. ‘పెరట్లో పాములు పెంచుతున్నప్పుడు.. అవి కేవలం పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించకూడదు. చివరికి అవి వారిని కూడా కాటేస్తాయి’ అని చెప్పారు. కానీ పాకిస్థాన్కు మంచి సలహాలు తీసుకునే అలవాటు లేదు. ఇప్పుడు ఆ దేశంలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసు’’ అని దాయాదిని ఘాటుగా విమర్శించారు.
ప్రస్తుతం యావత్ ప్రపంచం ఆ దేశాన్ని(పాకిస్థాన్ను ఉద్దేశిస్తూ) ఉగ్రవాద కేంద్రంగా చూస్తోందని జైశంకర్ అన్నారు. ‘‘గత రెండున్నరేళ్లుగా మన ఆలోచనలన్నీ కరోనా మహమ్మారి చుట్టూనే ఉన్నాయి. కానీ, ప్రపంచం ఏం తెలివితక్కువది కాదు. ఉగ్రవాదం ఎక్కడి నుంచి మొదలైందన్న విషయాన్ని అన్ని దేశాల ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. అందుకే ఇతరులపై నిందలు వేయాలని కలలు కనే ముందు తామేంటో గుర్తుచేసుకోవాలి’’ అని ఎద్దేవా చేశారు. ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ నివాసం ముందు గతేడాది బాంబు పేలుడు జరిగింది. అయితే, ఈ దాడి వెనుక భారత్ కుట్ర ఉందని ఆరోపిస్తూ పాకిస్థాన్ ఇటీవల ఓ పత్రాన్ని విడుదల చేసింది. ఉగ్రవాదాన్ని భారత్ కంటే మెరుగ్గా ఎవరూ ఉపయోగించుకోలేరంటూ ఆ దేశ మంత్రి నోరుపారేసుకున్నారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన జైశంకర్.. పాక్కు గట్టిగా బుద్ధిచెప్పారు.
ఇది మీ మంత్రినే అడగాలేమో..!
పాకిస్థాన్, కాబుల్, దిల్లీ నుంచి ఉగ్రవాదం వ్యాప్తి చెందడాన్ని దక్షిణాసియా ఇంకెంతకాలం చూస్తుంది? అని ఓ పాక్ విలేకరి అడిగిన ప్రశ్నకు జైశంకర్ దీటైన సమాధానం చెప్పారు. ‘‘మీరు ఈ ప్రశ్న వేరే మంత్రిని అడుగుతున్నారు. మనం ఇంకెంతకాలం దీన్ని చూడాలనేది మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు.. ఈ ప్రశ్న పాకిస్థాన్ మంత్రులను అడగాలి. ఇంకెంతకాలం పాక్.. ఉగ్రవాదాన్ని అనుసరించాలనుకుంటుందో ప్రశ్నించాలి’’ అని జర్నలిస్టుకు కౌంటర్ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ODI WC 2023: భారత స్పిన్ బౌలింగ్తో ప్రత్యర్థులు జాగ్రత్త: పాక్ మాజీ కెప్టెన్
-
UGC NET 2023: యూజీసీ నెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల
-
Elections: అభ్యర్థుల నేర చరిత్రను.. పత్రికా ప్రకటనల్లో వెల్లడించాలి : ఎన్నికల సంఘం
-
World Culture Festival: ఉక్రెయిన్లో శాంతిస్థాపన కోసం 180 దేశాల ప్రజల ప్రార్థన
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి
-
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు