Ukraine Crisis: రష్యా దాడుల్లో ప్రపంచంలో అతిపెద్ద విమానం ధ్వంసం

కీవ్‌ సరిహద్దుల్లో మోహరించిన ఉన్న పుతిన్‌ బలగాలు.. హోస్టోమెల్‌ విమానాశ్రయంపై బాంబులు విసిరాయి. దీంతో అక్కడే ఉన్న ప్రపంచంలోనే అత్యంత పెద్ద విమానం ఏఎన్‌-225 ‘మ్రియా’ ధ్వంసమైంది....

Updated : 28 Feb 2022 17:21 IST

కీవ్‌: ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతూ.. రాజధాని కీవ్‌ నగరంపై పట్టు సాధించే దిశగా రష్యన్‌ సేనలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో కీవ్‌ సరిహద్దుల్లో మోహరించిన ఉన్న పుతిన్‌ బలగాలు.. హోస్టోమెల్‌ విమానాశ్రయంపై బాంబులు విసిరాయి. దీంతో అక్కడే ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఏఎన్‌-225 ‘మ్రియా’ ధ్వంసమైంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ట్విటర్‌ వేదికగా సోమవారం వెల్లడించారు. మ్రియా అంటే ఉక్రెయిన్‌ భాషలో ‘కల’ అని అర్థం. అయితే, దీన్ని మళ్లీ పునర్‌నిర్మిస్తామని ఉక్రెయిన్‌ ప్రతినబూనింది. అలాగే స్వేచ్ఛాయుత, బలమైన ప్రజాస్వామ్య ఐరోపా దేశంగా ఉక్రెయిన్‌ను నెలకొల్పాలన్న తమ కలను సైతం నిజం చేసుకుంటామని వ్యాఖ్యానించింది. మ్రియా విమానాన్ని కూల్చగలిగారు కానీ, మా కలను మాత్రం ధ్వంసం చేయలేరు అని ఉక్రెయిన్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో రాసుకొచ్చారు.

ఈ విమానాన్ని ఉక్రెయిన్‌కు చెందిన ఎరోనాటిక్స్ సంస్థ ఆంటొనోవ్‌ తయారు చేసింది. రష్యా దాడిపై స్పందిస్తూ.. ప్రస్తుతం ఏన్‌-225 పరిస్థితి ఏ దశలో ఉందో వివరించలేమని తెలిపింది. సాంకేతిక నిపుణులు పరిశీలించిన తర్వాతే దాని కండిషన్‌ను చెప్పగలమని తెలిపింది.

రష్యా సేనల కదలికల్ని నిలువరించేలా...

మరోవైపు కీవ్‌ నగరంలోకి దూసుకెళ్లేందుకు యత్నిస్తున్న రష్యా బలగాలను నిలువరించేందుకుగానూ గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌లో ఉండే కొన్ని కీలక సాధనాలను డీయాక్టివేట్‌ చేసింది. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పరిస్థితులు, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండే రద్దీకి సంబంధించిన సమాచారం తెలియకుండా చేసింది. తద్వారా రష్యా సేనల దాడుల నుంచి స్థానిక ఉక్రెయిన్‌ ప్రజలకు భద్రత లభిస్తుందని పేర్కొంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

మరోవైపు రోడ్లపై ఉండే ట్రాఫిక్‌ గుర్తులు, వివిధ ప్రాంతాలకు వెళ్లే మార్గాలను సూచించే సూచికలను సైతం స్థానిక సంస్థలు తొలగించాయి. తద్వారా రష్యన్ బలగాలకు ఎటువెళ్లాలో తెలియని గందరగోళ పరిస్థితి సృష్టించేందుకు యత్నిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని