G20 Summit: జీ20 సదస్సులో కెనడా ప్రధానిపై జిన్‌పింగ్ అసహనం!

జీ20 వేదికగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీరు పట్ల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అసహనం వ్యక్తంచేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

Published : 17 Nov 2022 01:13 IST

బాలి: ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే చైనా.. జీ20 వేదికగా జరిపిన చర్చల వివరాలు బహిర్గతం కావడంపై కెనడాపై అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే? చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో జీ20 సదస్సులో భాగంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఈ భేటీకి  సంబంధించిన వివరాలు మీడియాలో రావడంపై ట్రూడో తీరుపట్ల జిన్‌పింగ్‌ తన అంసతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ కెనడా జర్నలిస్టు రికార్డు చేశారు. 

‘‘మనం చర్చించిన విషయాలు మీడియాలో వచ్చాయి. ఇది సరైన పద్ధతికాదు. చర్చలు జరిపే విధానం ఇది కాదు’’ అని జిన్‌పింగ్ పేర్కొన్నారు. దీనిపై ట్రూడో మాట్లాడుతూ..‘‘కెనడాలో ప్రతిదీ పారదర్శకంగా, నిజాయితీగా ఉండాలని మేం భావిస్తాం. దాన్నే మేం కొనసాగిస్తాం. కలిసి పనిచేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధం. కానీ, కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం సాధ్యంకాదు’’ అని జిన్‌పింగ్‌కు బదులిచ్చినట్టుగా ఆ వీడియోలో రికార్డయింది. అనంతరం ఇరువురు నేతలు పరస్పరం కరచాలనం చేసుకుని ఎవరి దారిలో వారు వెళ్లిపోవడం ఈ వీడియోలో చూడొచ్చు. మూడేళ్ల అనంతరం చైనా అధ్యక్షుడు, కెనడా ప్రధాని మధ్య జీ20 సదస్సు వేదికగా చర్చలు జరిగాయి. ఈ భేటీలో ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్టు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని