Zelensky: మస్క్‌.. నువ్వు వచ్చి చూసి మాట్లాడు..: జెలెన్‌స్కీ ఆగ్రహం

ఉక్రెయిన్ శాంతిపై గతంలో ట్విటర్‌ అధినేత మస్క్‌ నిర్వహించిన పోల్‌ను జెలెన్‌స్కీ ఇంకామర్చిపోలేదు. తాజా ట్విటర్‌ చీఫ్‌కు ఆయన మరో సారి క్లాస్‌పీకారు. ఉక్రెయిన్‌ వచ్చి చూసి మాట్లాడాలని పేర్కొన్నారు. 

Published : 01 Dec 2022 10:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి ట్విటర్‌ చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో మస్క్‌.. ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధ విరమణ కోసం కొన్ని ప్రతిపాదనలు చేసి విమర్శలపాలైన విషయం తెలిసిందే. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో జెలెన్‌స్కీ దీనిపై స్పందిస్తూ.. మస్క్‌ ఉక్రెయిన్‌ వచ్చి అలా మాట్లాడాలని అన్నారు. ‘‘ఆయనపై ఎవరి ప్రభావమైనా ఉండొచ్చు.. లేదా అతనే సొంతంగా ఇష్టమొచ్చిన తీర్మానాలు చేసి ఉండొచ్చు. రష్యా ఇక్కడ ఏం చేస్తోందో అతనికి అర్థం కావాలంటే.. స్వయంగా ఉక్రెయిన్‌ వచ్చి ఇక్కడి పరిస్థితులు చూడాలి. యుద్ధం ఎవరు మొదలుపెట్టారో.. ఆ యుద్ధాన్ని ఎలా.. ఎప్పుడు ముగించాలో చెప్పాలి’’ అని జెలెన్‌స్కీ అన్నారు.

ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, జపోరిజియా, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు పుతిన్‌ ఇటీవల ప్రకటించారు. దీన్ని ఐరాస తీవ్రంగా వ్యతిరేకించింది. దీన్ని ఉద్దేశిస్తూ ఆ మధ్య మస్క్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘1) రష్యా విలీన ప్రాంతాల్లో ఐరాస పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఎన్నిక జరగాలి. ఒకవేళ ప్రజల తీర్పు ఉక్రెయిన్‌కు అనుకూలంగా ఉంటే.. రష్యా ఆ ప్రాంతాన్ని వీడాలి. 2) 1783 నుంచి క్రిమియా అధికారికంగా రష్యాలో భాగమే. (1954లో సోవియెట్‌ పాలకుడు కృశ్చేవ్‌.. క్రిమియాను ఉక్రెయిన్‌కు బహుమతిగా ఇచ్చారు)  దానికి నీటి సరఫరా హామీ ఉండాలి. 3) ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు. అలాగే తన ప్రణాళికను ఓటింగ్‌లో పెట్టారు. అయితే దీనిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహా పలువురు ఉక్రెయిన్‌ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో జెలెన్‌స్కీ కూడా దీనికి పోటీగా ఓటింగ్‌ పెట్టారు.  ‘ఉక్రెయిన్‌కు మద్దతిచ్చే మస్క్‌ ఇష్టామా?.. రష్యాకు మద్దతు ఇచ్చే మస్క్‌ ఇష్టమా?’ అని దానిలో అడిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని