Measles: జింబాబ్వేలో మీజిల్స్‌ విలయం.. 700 మంది చిన్నారులు మృతి

ఆఫ్రికాలోని జింబాబ్వేలో మీజిల్స్‌ (Measles) విలయం సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారినపడి ఇటీవల 698 మంది చిన్నారులు మృత్యువాతపడినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Published : 06 Sep 2022 01:33 IST

హరారే: ఆఫ్రికాలోని జింబాబ్వేలో మీజిల్స్‌ (Measles) విలయం సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారినపడి ఇటీవల 698 మంది చిన్నారులు మృత్యువాతపడినట్లు జింబాబ్వే ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా టీకాను తప్పనిసరి చేయాలని.. ఇందుకు సంబంధించి చట్టాన్ని సవరించాలనే డిమాండ్‌ మొదలయ్యింది. మరోవైపు భారీ స్థాయిలో నమోదవుతోన్న మీజిల్స్‌ (Measles) కేసులు, మరణాలపై అటు ఐరాస విభాగం యూనిసెఫ్‌ (UNICEF) కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

జింబాబ్వేలోని (Zimbabwe) మనికాల్యాండ్‌ ప్రావిన్సులో ఏప్రిల్‌ తొలివారంలో మీజిల్స్‌ వ్యాధిని గుర్తించారు. అనంతరం కొన్ని వారాల్లోనే దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పటివరకు 6291 కేసులు నమోదుకాగా.. 698 మంది చిన్నారులు మృత్యువాతపడినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేవలం సెప్టెంబర్‌ 1వ తేదీన ఒక్కరోజే 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. రెండు వారాల క్రితం కేవలం 157 మరణాలే ఉండగా..  తాజాగా ఆ సంఖ్య నాలుగు రెట్లు పెరగడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది.

వ్యాక్సిన్‌ తీసుకోకపోవడమే కారణం..

మత విశ్వాసాల కారణంగా అక్కడ (Zimbabwe) చాలా కుటుంబాలు వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల మరణించిన వారిలో వ్యాక్సిన్‌ తీసుకోని వారే అధికంగా ఉన్నట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి మోనైకా ముత్స్‌వాంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టీకాను తిరస్కరించే వర్గాలే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు పెంచాలని అక్కడి మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ జోహన్నస్‌ మారిసా పేర్కొన్నారు. ఆరు నెలల నుంచి 15ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు మీజిల్స్‌ టీకాలు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు.

ప్రపంచంలో అధికంగా సంభవించే అంటువ్యాధుల్లో మీజిల్స్‌ కూడా ఒకటి. దగ్గు, తుమ్మడం లేదా సన్నిహితంగా మెలగడం వల్ల ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దగ్గు, జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీజిల్స్‌ వ్యాక్సిన్‌ తీసుకోని పిల్లల్లో ఈ లక్షణాలు ఎక్కువై మరణం కూడా సంభవిస్తుంది. ముఖ్యంగా పోషకాహారలోపంతో బాధపడే చిన్నారుల్లో వ్యాధి వ్యాప్తి అధికంగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని