ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు నిరసన సెగ.. కాన్వాయ్ని అడ్డుకున్న యువజన నాయకులు
గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి రాజీవ్ రహదారిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. యువజన సంఘాల నాయకులు భారీ సంఖ్యలో రాజీవ్ రహదారిపై బైఠాయించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రోడ్డన్నా తీసుకురావాలి, లేదా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీరికి సంపూర్ణ మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై ధర్నాలో పాల్గొన్నారు. స్థానికేతరుడైన రసమయి బాలకిషన్ తెలంగాణ ఉద్యమం పేరుతో ఎమ్మెల్యేగా మానకొండూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అంతలోనే బెజ్జంకి మండలం బేగంపేట్లో ఓ కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్ని గుర్తించి యువజన నాయకులు అడ్డుకున్నారు. చెప్పులు విసురుతూ దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని లాఠీఛార్జీ చేశారు. రసమయి రాకముందే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు మరో 20 మంది యువజన, కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకొని తిమ్మాపూర్ పోలీసుస్టేషన్కు తరలించారు.