logo

హైదరాబాద్ వార్తలు

Short News

పట్టణం మరింత పరిశుభ్రం
వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: వికారాబాద్‌ పట్టణం వివిధ వార్డుల్లో వారం రోజులుగా కొనసాగిన ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. 34 వార్డుల్లో పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా పుర అధ్యక్షురాలు మంజుల మాట్లాడుతూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ద్వారా పట్టణం మరింత పరిశుభ్రంగా మారిందన్నారు. చివరి రోజు 1, 2, 15, 19, 33 వార్డుల్లో పరిశుభ్రతా పనులను పరిశీలించానని తెలిపారు. ఈ వార్డులు ఎంతో పరిశుభ్రంగా మారాయని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సుధాకర్‌రెడ్డి, రాములు, వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు రమేశ్‌కుమార్‌, పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్‌ మొహినొద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.

వేలాడే యమపాశం.. తగిలితే ప్రమాదం
తాండూరు మండలం చిట్టిగణాపూర్‌ చెరువు పరిసరాల్లో విద్యుత్‌ స్తంభం నేలకు ఒరిగింది. తీగలు తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి. ఈదురు గాలులు వీస్తే స్తంభం నేలపై పడే ఆస్కారముంది. దీంతో గ్రామస్థులకు, పాడిపశువులకు విద్యుదాఘాత ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ట్రాన్స్‌కో అధికారులు వెంటనే స్తంభాన్ని సక్రమంగా అమర్చాలని కోరుతున్నారు. న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ

ప్రధాన రోడ్ల అభివృద్ధికి చర్యలు
న్యూస్‌టుడే, తాండూరు: తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం మరో రూ.20.20 కోట్లను మంజూరు చేసింది. ఈమేరకు జీవో నం.237ను ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి విజియేంద్ర బోయి జారీ చేశారు.  పట్టణంలోని బస్‌ స్టేషన్‌ నుంచి సెంట్‌ మార్క్స్‌ ఉన్నత పాటశాల వరకు అభివృద్ధి చేస్తున్న జాతీయ రహదారికి సుందరీకరణ, ఇరువైపులా తారు వేయడం, వరద కాల్వల నిర్మాణానికి ఇటీవలే ప్రభుత్వం రూ.25 కోట్లను మంజూరు చేసిన విషయం విదితమే. తాజాగా ఇచ్చిన మొత్తంలో  వికారాబాద్‌- తాండూరు మార్గంలోని కిలోమీటరు ఇప్పటికే విస్తరించిన రోడ్డుకు ఇరువైపులా వరద కాల్వలు, క్రాస్‌ డ్రైయిన్స్‌ నిర్మాణానికి రూ.5.20 కోట్లు వెచ్చిస్తారు. తాండూరు -కోట్‌పల్లి మార్గంలోని పాల శీతలీకరణ కేంద్రం నుంచి అంతారం గ్రామం శివారు బైపాస్‌ రోడ్డు కూడలి వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లు వ్యయం చేయనున్నారు. గతంలో తాను చేసిన విజ్ఞప్తి మేరకు రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, రహదారులు, భవనాల శాఖమంత్రి ప్రశాంత్‌రెడ్డి నిధులు విడుదలచేశారన్నారు. మంజూరైన నిధులకు పరిపాలన ఆమోదం లభించిందని చెప్పారు. త్వరలోనే టెండర్లను పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: పురపాలికలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా అదనంగా పనులు నిర్వహించిన కార్మికులకు అదనంగా డబ్బులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్‌ కోరారు. శనివారం అన్ని వార్డుల్లో పర్యటించి కార్మికుల పనులను పరిశీలించి వారితో చర్చించానని ఆయన అన్నారు. కార్మికులకు పురపాలక అధికారులు సరఫరా చేసే మధ్యాహ్న భోజనం సక్రమంగా లేదన్నారు.

మారథాన్‌
వరల్డ్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ డే సందర్భంగా సొసైటీ ఫర్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ ఇండియా(సెమీ) ఆధ్వర్యంలో శనివారం నెక్లెస్‌ రోడ్డులో మారథాన్‌ నిర్వహించారు. సంజీవయ్య పార్కు సమీపంలో 10కె సైక్లోథాన్‌ను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. న్యూస్‌టుడే, ఖైరతాబాద్‌

ప్రేమమాలినికి బీఆర్కే స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు
ఖైరతాబాద్‌: టీవీ జర్నలిస్టు వనం ప్రేమ మాలినికి 2023 ఏడాదికి సీనియర్‌ జర్నలిస్టు భళ్లమూడి రామకృష్ణ స్మారక  ఉత్తమ జర్నలిస్టు అవార్డు ప్రదానం చేశారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆమెను జ్ఞాపిక, రూ. 25,000 నగదు అందజేశారు. అతిథిగా సీనియర్‌ జర్నలిస్టు వీఎస్‌ఆర్‌ శాస్త్రి, గౌరవ అతిథులు మంజులత కళానిధి, డా.ఎస్‌.రాము, వందన ద్విభాష్యం,  వనం జ్వాలా నరసింహారావు పాల్గొన్నారు.

బాల బాలికల సంరక్షణలో జిల్లాకు అగ్ర స్థానం
వికారాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లా బాల బాలికల సంరక్షణ, మహిళల అక్రమ రవాణా నిరోధక బృందం(ఏహెచ్‌టీయూ) సమర్థ విధులు, చైతన్య కార్యక్రమాలతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. శనివారం మహిళల రక్షణ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో జిల్లా ఏహెచ్‌టీయూ సీఐ దాసుకు ఉమెన్‌ సేప్టీ వింగ్‌ అదనపు డీజీపీ షికాగోయల్‌ ప్రశంసాపత్రం అందజేశారు. 2022 సంవత్సరానికి రాష్ట్రంలో ఉన్న 31 ఏహెచ్‌టీయూ బృందాల్లో వికారాబాద్‌ జిల్లా బృందం అగ్రస్థానంలో నిలిచింది. ఆపరేషన్‌ స్మైల్‌, ముస్కాన్‌ కార్యక్రమాల ద్వారా 316 మంది బాలబాలికలను గుర్తించి బడికి పంపారు. బాల్య వివాహాలు, భ్రూణహత్యలు, బాలల హక్కులు, మానవ అక్రమ రవాణా నిరోధించడం, బాల కార్మికులు, గృహహింస తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో జిల్లా బృందం విశేష కృషి చేసింది. ప్రశంసాపత్రం అందుకున్న సీఐ దాసును ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు.

జీర్ణకోశ సంబంధ సమస్యలపై కిమ్స్‌లో ఐబీడీ క్లినిక్‌
రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: పెద్దపేగు, చిన్న పేగులను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన వైద్య సేవలకు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో ఇన్‌ఫ్లమేటరీ బొవెల్‌ డీసీజ్‌ (ఐబీడీ) కోసం  స్పెషాలిటీ క్లినిక్‌ను శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో కిమ్స్‌ ఆసుపత్రుల సీఎండీ డాక్టర్‌ బి.భాస్కర్‌రావు మాట్లాడుతూ.. ఐబీడీ అనేది జీర్ణకోశం అంటే ముఖ్యంగా పెద్దపేగు, చిన్న పేగులను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిందని తెలిపారు.

ఆ స్థలం మాదంటే మాదే..
రెజిమెంటల్‌బజార్‌: సికింద్రాబాద్‌ ఎస్పీరోడ్‌ ప్యారడైజ్‌ ప్రాంతంలోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, అగ్ని మాపకశాఖ అధికారుల మధ్య  వివాదం  నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది పోలీసు బందోబస్తుతో వచ్చి స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కార్యాలయం ఎదుట గేటు మూసివేస్తూ గోడ నిర్మించింది. దీంతో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, అగ్నిమాపక శాఖ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కార్యాలయంలో ముందు భాగంలో రెండు ఫైర్‌ స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్ల మధ్య స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ అవుట్‌ గేటు ఉంది. శనివారం ఉదయం వివిధ అగ్నిమాపక కేంద్రాల నుంచి సిబ్బందిని రప్పించిన అధికారులు అవుట్‌గేటు స్థానంలో ఉన్న సామగ్రి తొలగించి గేట్‌ మూసివేస్తూ గోడ నిర్మించేందుకు యత్నించారు. స్కౌట్స్‌ ప్రతినిధులు అక్కడికి చేరుకుని పోలీసులు, ఫైర్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ స్థలం తమదంటే తమదని రెండు శాఖల అధికారులు గొడవ పడుతుండగానే అగ్నిమాపక సిబ్బంది హడావుడిగా గేటు మూసివేసి గోడ నిర్మించారు. ప్రధాన రహదారి వైపు ఉండే మరో గేటునూ మూసివేస్తూ గోడ నిర్మిస్తుండటంతో స్కౌట్స్‌ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వికారాబాద్‌ టౌన్‌, న్యూస్‌టుడే: మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేయూతను అందిస్తుందని భారాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. శనివారం పట్టణంలోని అంబేడ్కర్‌ భవనంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా లబ్ధిదారులకు మంజూరైన కుట్టుమిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇంటి వద్దనే ఉంటూ జీవనోపాధి పొందేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఆర్థిక అభివృద్ధి సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నవాబ్‌పేట, న్యూస్‌టుడే: బలన్మరణానికి పాల్పడిన పంచాయతీ కార్మికుడి మృతిపై అనుమానం ఉందంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. ఈ సంఘటన మండల పరిధిలోని అక్నాపూర్‌లో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన దయ్యాల రత్నయ్యకు భార్య సత్తమ్మతో పాటు, పిల్లలున్నారు. గ్రామ పంచాయతీలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రత్నయ్య ఈ నెల 18 బలవన్మరణానికి (ఉరేసుకొని మృతిచెందాడు) పాల్పడ్డాడు. మద్యం అలవాటు ఉండేదని, ఆ మత్తులోనే ఉరేసుకొని మృతిచెంది ఉంటాడని, పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే కుటుంబీకులు  అంత్యక్రియలు నిర్వహించారు. ఇదే గ్రామానికి చెందిన కొందరు రత్నయ్యను కొట్టి చంపి, ఉరేసి ఉంటారని గ్రామంలో చర్చ జరిగింది. ఈ విషయం కుటుంబీకులకు తెలిసింది. మా తమ్ముడు (రత్నయ్య) మృతిపై అనుమానం ఉందంటూ మృతుడి అన్న చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు  చేశారు. దీంతో శనివారం తహసీల్దారు రవీందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు, గ్రామస్థుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. వైద్యాధికారి శాంతప్ప సమక్షంలో పంచనామ నిర్వహించారు. దర్యాప్తుతో పాటు, వైద్యుల నివేదిక అనంతరం హత్యా, బలవన్మరణమా అనే విషయం తేలుతుందని ఎస్సై భరత్‌భూషణ్‌ తెలిపారు.

చేవెళ్ల, న్యూస్‌టుడే: చేవెళ్ల కోర్టు కాంప్లెక్స్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని న్యాయవాదులు ఎంపీ రంజిత్‌ రెడ్డిని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. బార్‌ అసోసియేషన్‌కు పక్కా భవనం నిర్మించాలని కోరారు. చేవెళ్లలో అదనపు జిల్లా కోర్టు, అడిషనల్‌ జూనియర్‌ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు. చేవెళ్ల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు యాదిరెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్‌, న్యాయవాదులు రామ్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, శంషుద్దీన్‌, వెంకటేశం తదితరులు ఉన్నారు.

నవాబ్‌పేట, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ సారథ]్యంలో పల్లెల్లో అభివృద్ధి జరుగుతోందని, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరుతున్నాయని చేవెళ్ల శాసన సభ్యులు కాలె యాదయ్య అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథ]కాలు పరిశీలించడంతోపాటు నేరుగా సమస్యలు తెలుసుకునేందుకు శుభోదయం  కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో భాగంగా శనివారం ముందుగా మండల పరిధిలోని ముబారక్‌పూర్‌లో సర్పంచి చిట్టెపు బాలమణి, ఎంపీటీసీ దయాకర్‌రెడ్డితో కలిసి పర్యటించారు. గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో రూ.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం మైతాబ్‌ఖాన్‌గూడలో సర్పంచి అనితారంగారెడ్డి, ఎంపీటీసీ సుమలత మాణిక్‌రెడ్డిలతో కలిసి గ్రామంలో కలియతిరిగారు. గ్రామంలో మూడు రోజులుగా నీటి సరఫరా లేదని, ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యేకు మహిళలు వివరించారు. కార్యక్రమంలో మండల భారాస పార్టీ, సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డి, రావుగారి వెంకట్‌రెడ్డి, ఏఎంసీ, పీఏసీఎస్‌ ఛైర్మన్లు డా. ప్రశాంత్‌గౌడ్‌, పోలీస్‌ రాంరెడ్డి, నాయకులు రంగారెడ్డి, చిట్టెపు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు, హైదరాబాద్‌: లండన్‌ నగరంలో రహదారుల పొడవునా, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వీధి పటాలను.. హైదరాబాద్‌, వరంగల్‌లాంటి నగరాల్లో ఏర్పాటు చేయాలంటూ అనుజ్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ను కోరగా.. ఆయన వెంటనే స్పందించారు. బోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతం చుట్టూ.. చెప్పుకోదగిన ప్రాంతాలను డిజిటల్‌ పటంలో చూపుతూ, వాటి ప్రాముఖ్యాన్ని, అక్కడికి చేరుకునే మార్గాన్ని సూచించడం వీధి పటాల గొప్పదనం. లండన్‌ నగరాన్ని వీక్షించేందుకు వెళ్లే పర్యాటకులకు, కొత్త వారికి అవి చాలా ఉపయోగపడుతున్నాయని సమాచారం. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మిని శనివారం ట్యాగ్‌ చేశారు.

ఈనాడు- హైదరాబాద్‌: ఇతర దేశానికి చెందిన నేరగాళ్లు నగరానికి వచ్చి డబ్బు కొట్టేసిన ఉదంతమిది. ఈ ఏడాది ఫిబ్రవరిలో  కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బంగ్లాదేశ్‌కు చెందిన దొంగలు రూ.8 లక్షలు కొట్టేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కూకట్‌పల్లిలో విదేశీ నగదు మార్పిడి(మనీ ట్రాన్స్‌ఫర్‌ ఏజెన్సీ) సంస్థ కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు వ్యక్తులు ఏజెన్సీలోకి ప్రవేశించి ప్రతినిధితో పరిచయడం పెంచుకున్నారు.  రెండుసార్లు 500 డాలర్ల నగదు మార్పిడి చేసుకొంటూ నమ్మకం కలిగేలా చేశారు. మూడోసారి     పథకం ప్రకారం.. తమ తల్లి అనారోగ్యానికి గురైందని, వెంటనే రూ.8 లక్షలు కావాలని ఏజెన్సీ ప్రతినిధికి సమాచారమిచ్చారు. తాముండే ప్రాంతానికి వచ్చి డాలర్లు తీసుకుని.. నగదు ఇవ్వాలని కోరారు. ఇదంతా నమ్మిన ఉద్యోగి..  నగదును తమ కుమారుడికి ఇచ్చి పంపారు. నిందితులు మొత్తం సొమ్ము ఇవ్వకుండా నోట్ల కట్ట పైన, కింద 100 డాలర్ల నోట్లు ఉంచి... మధ్యలో మాత్రం ఒక డాలర్‌ నోట్లు 98 ఉంచారు. ఉద్యోగి కుమారుడు ఇవేవీ గమనించలేదు. నిందితులు నగదు తీసుకుని వెళ్లిపోయారు. మరుసటి రోజు అతని తండ్రి చూడగా.. కంగుతిని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు సమాచారంతో బంగ్లాదేశీ లింకు.. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు నిందితులు వినియోగించిన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అతనిచ్చిన వివరాల ఆధారంగా నిందితులిద్దరూ బంగ్లాదేశీయులని తేలింది. ఇక్కడ డబ్బు కొట్టేశాక.. నేరుగా చెన్నై వెళ్లారు. అక్కడి నుంచి కోల్‌కతా.. అటు నుంచి బంగ్లాదేశ్‌ వెళ్లిపోయారు. నిందితుల పాస్‌పోర్టు, ఇతర వివరాలు సేకరించారు. లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. నిందితులు మరోసారి దేశంలో అడుగుపెడితే వెంటనే అరెస్టవుతారని పోలీసులు చెప్పారు.

ఈనాడు, హైదరాబాద్‌: ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా శనివారం కొత్తగా 682 పాస్‌పోర్టులు మంజూరు చేసినట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. మొత్తం 700 అపాయింట్‌మెంట్లు మంజూరు చేయగా.. 682 పాస్‌పోర్టుల దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన వాటిని తిరస్కరించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోని 14 తపాలా కార్యాలయాల్లోని సేవా కేంద్రాల్లో ప్రతి శనివారం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.