panchayat elections: విధి ఓడించినా... ఓటర్లు గెలిపించారు

Eenadu icon
By Telangana News Desk Updated : 15 Dec 2025 05:56 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

శంకర్‌పల్లి, న్యూస్‌టుడే: శంకర్‌పల్లి మండలం మాసానిగూడ గ్రామంలో ఆదివారం 8వ వార్డు సభ్యురాలుగా పల్లె లత(42) తన సమీప ప్రత్యర్థిపై 30 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వాస్తవానికి ఈ నెల 7వ తేదీన మాసానిగూడ అనుబంధ గ్రామం మంచర్లగూడెంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న క్రమంలో ఆమెకు ఛాతీలో నొప్పి వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అయినప్పటికీ లతను ఓటర్లు ఆదరించడం గమనార్హం. ఈ వార్డు స్థానానికి మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేసి, ఎన్నిక నిర్వహిస్తామని ఎంపీడీఓ వెంకయ్య తెలిపారు.


మరణించిన అభ్యర్థిని వరించిన విజయం!

రాయికోడ్, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం పీపడ్‌పల్లిలో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మరణించిన అభ్యర్థినే విజయం వరించింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు సొంత పార్టీ వాళ్లే మోసం చేస్తున్నారనే ఆందోళనతో ఈ నెల 8న సర్పంచి అభ్యర్థి చాల్కి రాజు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో రాజు 9 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 


తాజా వార్డు సభ్యుడి ఆత్మహత్య!

కాల్వశ్రీరాంపూర్, న్యూస్‌టుడే: వార్డు సభ్యుడిగా గెలిచిన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం... కాల్వశ్రీరాంపూర్‌ మండలం పందిల్లకు చెందిన రేవెల్లి రాజ్‌కుమార్‌(35) తొలివిడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. ఆయన గతేడాదిగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఓట్ల కోసం గ్రామానికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు అనంతరం హైదరాబాద్‌ వెళ్లిపోయారు. రాజ్‌కుమార్‌ ఆదివారం గ్రామంలో మిత్రులతో కలిసి మద్యం తాగినట్లు సమాచారం. సాయంత్రానికి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతిపై గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags :
Published : 15 Dec 2025 04:48 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని