
తాజా వార్తలు
చనువుగా ఉన్నాడని చంపేశాడు..
వీడిన పినవేమలి హత్య కేసు మిస్టరీ
విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్టుడే: పినవేమలిలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నలుగుర్ని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. వివరాలను బుధవారం ఎస్పీ బి.రాజకుమారి వెల్లడించారు. పినవేమలికి చెందిన కె.రవికుమార్(26) ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే నెల 19న నేల బావిలో శవమై తేలడంతో హత్యకేసుగా నమోదు చేశారు. ఊరి చివరున్న తోటలో పార్టీ చేసుకోవడమే గాకుండా... అంతా కలిసి తిరుపతికి వెళ్లారని బాలి పైడిరాజు, వారి ముగ్గురి స్నేహితులపై పోలీసులకు అనుమానం రావడంతో దర్యాప్తు చేశారు. పైడిరాజుకు గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమె రవికుమార్తో కూడా చనువుగా ఉండేది. ఈక్రమంలో తట్టుకోలేక రవికుమార్తో తరచూ గొడవపడేవాడు. చివరికి అంతం చేయాలని నిర్ణయించుకొన్నాడు. ఫిబ్రవరి 17న సర్పంచి గెలుపు సంబరాలు చేసుకుంటున్న వేళ చంపితే ఎన్నికల హడావుడిలో చేసిందిగా అంతా అనుకుంటారని భావించాడు. పధకం ప్రకారం ఊరిచివర తోటలో స్నేహితులతో మద్యం పార్టీ ఏర్పాటు చేశాడు. దీనికి కె.ఉదయ్కిరణ్, జి.నారాయణరావు, ఇ.సత్యనారాయణ, రవికుమార్ను పిలిచాడు. మద్యం మత్తులో ఉన్న రవికుమార్ మెడకు పైడిరాజు తాడును బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక మిగిలిన స్నేహితులకు చెప్పాడు. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరిద్దామనడంతో చీరను తెచ్చి మెడకు బిగించి చెట్టుకు కట్టేశారు. బరువు ఎక్కువవ్వడంతో చెట్టుకొమ్మ విరిగింది. కాళ్లకు తాళ్లు, రాళ్లు కట్టేసి నేల బావిలో పడేస్తే మృతదేహం పైకి తేలదని నారాయణరావు సలహా ఇవ్వడంతో అదే పనిచేశారు. చివరకు తేలడంతో పోలీసులు హత్యగా నిర్ధారించుకున్నారు. నిందితుడు పైడిరాజు తనే నేరం చేశానని, స్నేహితులు ముగ్గురు సహకరించారని వీఆర్వో ఎదుట లొంగిపోవడంతో పోలీసులు అందర్నీ రిమాండుకు తరలించారు.