News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2(29-03-2023)
Updated : 30 Mar 2023 16:54 IST
1/29
శ్రీరామనవమిని పురస్కరించుకొని కర్నూలు జిల్లా రాంబొట్ల ఆలయంలో కల్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్తు కాంతులతో, సీతారాముల విగ్రహాలను పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణం దీపకాంతులతో వెలుగుతోంది..
2/29
శ్రీరామనవమిని పురస్కరించుకొని సికింద్రాబాద్ సీతాఫల్మండిలోని శ్రీరామలింగేశ్వర ఆయలంలో కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్తు కాంతులతో అలంకరించారు.
3/29
హైదరాబాద్లోని హైటెక్ సిటీలో హైలైఫ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్కు సంబంధించిన కర్టెన్రైజర్ ఈవెంట్ నిర్వహించారు. కార్యక్రమంలో మిస్ యూనివర్స్ ఇండియా దివితా రాయ్, మోడల్ శ్రీలేఖ పాల్గొని సందడి చేశారు.
4/29
కర్టెన్రైజర్ ఈవెంట్లో ఫొటోలకు పోజులిస్తున్న మోడల్ శ్రీలేఖ
5/29
కాకినాడ సముద్ర తీరం నుంచి 20 కిలోమీటర్ల లోపల తీరగస్తీ దళం ఆధ్వర్యంలో రెస్క్యూ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోస్ట్గార్డ్ సిబ్బంది వివిధ నౌకలతో సముద్రంలో విన్యాసాలు చేశారు.
6/29
భద్రాద్రి సీతారాముల ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
7/29
బోడుప్పల్ పీర్జాదిగూడలోని ఒమేగా వుమెన్స్ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాంప్వాక్తో సందడి చేశారు. ఆటపాటలతో ఆకట్టుకున్నారు.
8/29
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఊరు పేరు భైరవకోన’ ఈ సినిమాలో ‘నిజమే నే చెబుతున్నా’ పాట ప్రోమోను గురువారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. పూర్తి పాటను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు చెప్పింది.
9/29
వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సైంధవ్’. ఈ సినిమాను డిసెంబర్ 22న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
10/29
నాంపల్లిలో నిర్వహిస్తున్న తెదేపా ఆవిర్భావ సభలో విజయ కేతనం చూపిస్తున్న చంద్రబాబునాయుడు. పక్కన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తెతెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
11/29
నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కస్టడీ’. మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా నాగచైతన్య, వెంకట్ప్రభు హైదరాబాద్లో హలీమ్ తిని, చాయ్ తాగి సందడి చేశారు.
12/29
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బేబి’. ఈ సందర్భంగా సినిమాలోని సెకండ్ సింగిల్ ‘దేవరాజ’ పాటను ఏప్రిల్ 3న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
13/29
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని పూలమాల వేసి నివాళి అర్పించారు.
14/29
సినీనటి కాజల్ తన తాజా ఫొటోను ఇన్స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు ఆమె ఫ్యాన్స్ ముగ్ధులవుతున్నారు. కాజల్ ప్రధాన పాత్రలో నటించిన ‘కోస్టి’ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.
15/29
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్, భారత క్రికెటర్ పృథ్వీ షా ఇలా సరదాగా ఫొటోలకు పోజులిచ్చారు. ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన వీరు ఒక చోట చేరారు.
16/29
ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలని అవగాహన కల్పిస్తూ కరీంనగర్లో 'స్వచ్ఛత మశాల్ మార్చ్' నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
17/29
ఈరోజుతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. పరీక్ష అనంతరం కరీంనగర్లో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఒకరికొకరు వీడ్కోలు పలికి కళాశాలలు, వసతి గృహాల నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు.
18/29
శ్రీరామనవమి సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భద్రాద్రి సీతారాములను దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
19/29
కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram), అతుల్య రవి జంటగా రమేష్ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మీటర్’. ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్లో సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో సినిమా నటీనటులు ఇలా మెరిశారు.
20/29
ఐపీఎల్ 2023 ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ జట్టు సభ్యులు రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, జోఫ్రా ఆర్చర్ కలిసున్న ఫొటోను ఆ టీమ్ ట్విటర్ వేదికగా పంచుకుంది.
21/29
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చేసిన సేవలను లోకేశ్ గుర్తుచేశారు.
22/29
నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తెదేపా ఆవిర్భావ సభ ఏర్పాట్లను ఘనంగా చేశారు. అప్పట్లో ఎన్టీఆర్ వినియోగించిన చైతన్య రథాన్ని ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.
23/29
నటుడు అల్లుఅర్జున్ తన 20 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా బన్నీతో దిగిన ఫొటోను పోస్టు చేస్తూ.. ‘డియర్ బన్నీ.. నీ 20 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నావు. నీ చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పటికీ కళ్లముందు మెదులుతున్నాయి. నా మేనల్లుడి నుంచి పాన్ ఇండియా స్టార్గా, ఐకానిక్ స్టార్గా ఎదిగావు. ఇలాగే నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ అందరి మన్ననలను పొందాలని కోరుకుంటున్నాను.’ అంటూ రాసుకొచ్చారు.
24/29
ప్రియదర్శి, కావ్యా కల్యాణ్రామ్ ప్రధాన పాత్రల్లో వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ‘బలగం’ సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేణు.. కొండగట్టు అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
25/29
ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల ఎంపీలకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో అల్పాహార విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు.
26/29
రవితేజ హీరోగా సుధీర్వర్మ తెరకెక్కించిన సినిమా ‘రావణాసుర’. ఏప్రిల్ 7న థియేటరల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలో రవితేజకు సంబంధించిన ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది. ‘రావణాసుర’ ట్రైలర్ మంగళవారం విడుదల కాగా.. అందులో ‘క్రిమినల్ లాయర్ కాదు.. లా చదివిన క్రిమినల్’ అనే డైలాగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
27/29
రవితేజ (Raviteja) కథానాయకుడిగా తెరకెక్కుతున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలు. రేణూ దేశాయ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
28/29
వరంగల్ ఏనుమాములలోని వ్యవసాయ మార్కెట్కు మంగళవారం సుమారు 35 వేల మిర్చి బస్తాలను విక్రయించేందుకు రైతులు తీసుకొచ్చారు. తూకాలు ఆలస్యం కావడంతో.. అప్పటికే అలసిపోయిన రైతన్నలు మిర్చి బస్తాలనే పాన్పులుగా భావించి ఓ కునుకు తీశారు.
29/29
నేచురల్ స్టార్ నాని తన కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా ట్విటర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘ నా జున్ను 6 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.. మీ ఆశీర్వాదాలు కావాలి’ అంటూ తన కుమారుడితో కలిసి దిగిన ఫొటోను నెటిజన్లతో పంచుకున్నారు. అభిమానులందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.