News In Pics: చిత్రం చెప్పే సంగతులు -1 (07-12-2022)
Updated : 07 Dec 2022 13:37 IST
1/16
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ చిత్రం ఖరారైంది. ‘#NBK 108’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూజా కార్యక్రమం గురువారం జరగనుందని వెల్లడిస్తూ చిత్రబృందం ఈ పోస్టర్ విడుదల చేసింది.
2/16
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర రాజస్థాన్లో సాగుతోంది. కోటా జిల్లాలో యాత్ర చేస్తున్న ఆయనను ఓ వెంట్రిలాక్విజం కళాకారుడు కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ ఆయన చేతిలోని బొమ్మను తీసుకుని ఇలా పరిశీలించారు.
3/16
నెల్లూరు నగరంలో తెదేపా ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ-మన బీసీలకు’ కార్యక్రమం నిర్వహించారు. తొలుత వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.
4/16
పచ్చదనానికి పాలకులు తొలి ప్రాధాన్యం ఇస్తున్నా యంత్రాంగం తీరుతో లక్ష్యం నెరవేరడం లేదు. హైదరాబాద్ సుందరీకరణలో భాగంగా వర్టికల్ గార్డెన్ అంటూ గచ్చిబౌలి పై వంతెన కింద, బయోడైవర్సిటీ వంతెన వద్ద చిన్న చిన్న కుండీలు ఏర్పాటు చేసినా నిర్వహణ లేమి ఫలితంగా నీరు అందక అందులో మొక్కలు వాడిపోయాయి. పచ్చదనంతో కనువిందు చేయాల్సిన ప్రాంతాలు అందవిహీనంగా మారాయి.
5/16
ట్రాఫిక్ నిబంధనలు పోలీసు వాహనాలకు వర్తించవా.. ఈ చిత్రం చూస్తే అదే నిజమనిపిస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నంబరు ప్లేట్లను తొలగించి, అవి కానరాకుండా స్టిక్కర్లు వేసిమరీ ప్రయాణిస్తున్నారు. వెనక కూర్చున్న వారికి శిరస్త్రాణం ఉండటం లేదు. సామాన్యులకైతే ఈ పాటికి చలాన్ల మోత మోగేదే..
6/16
అత్యాశ, పోలిక, స్వార్థం, ద్వేషం.. తదితర భావోద్వేగాలతో నేటి ఆధునిక యుగంలో సగటు మనిషి కాలంతో పరిగెడుతూ విలువలు, మానవత్వాన్ని మరిచి అమానవీయంగా ప్రవర్తిస్తున్న సంఘటనలను మనం రోజూ చూస్తూనే ఉన్నాయి. కానీ, హృదయాకారంలో ఉన్న ఈ బోన్సాయ్ వృక్షం.. మనుషులకే కాదు.. మాకూ మనసు ఉంటుందని, మమ్మల్నీ ప్రేమించండి అని చెబుతున్నట్లుగా ఉంది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని అగ్రి-హర్టికల్చర్ సొసైటీలో ఈ చిత్రం కనిపించింది.
7/16
ధాన్యంలో తేమ శాతం తగ్గించేందుకు రైతులు రోడ్లపై రోజుల తరబడి ఆరబెడుతున్నారు. రాత్రివేళల్లో మంచు పడకుండా కుప్పలుగా చేసి, వాటిపై పట్టాలు కప్పి రాళ్లు అడ్డుగా పెడుతున్నారు. చీకట్లో ఇవి కనిపించక పోవడంతో వాహనదారులు నేరుగా వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నారు. అమీర్పేట-గొల్లూరు రోడ్డుపై కనిపించిందీ చిత్రం.
8/16
హైదరాబాద్లో భిక్షాటన ధోరణి మారుతోంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని భిక్షాటన చేసేవారూ అందిపుచ్చుకొంటున్నారు. దానం చేయడానికి చిల్లర లేదా.. మరేం ఫరవాలేదు.. మా వద్ద ఫోన్ పే, గూగుల్ పే లాంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయంటున్నారు యాచకులు. కొంతమంది హిజ్రాలైతే ఇలా చెల్లించేంత వరకు వదలడం లేదు. లక్డీకాపూల్లో కనిపించిన దృశ్యం.
9/16
మహారాష్ట్రలోని నాగ్పుర్ మెట్రో గిన్నిస్ రికార్డు సాధించింది. ఇక్కడి 3.14 కిలోమీటర్ల డబుల్ డెకర్ వయాడక్ట్ మెట్రో.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నిర్మాణంగా గుర్తింపు పొందింది. ఇది వార్ధా రోడ్ ప్రాంతంలో ఉంది. ఈ డబుల్ డెకర్ వయాడక్ట్ ఇప్పటికే ఆసియాలోనే అతిపెద్ద నిర్మాణంగా గుర్తింపు పొందింది. దీని పైభాగంలో మెట్రోరైలు, మధ్యలో హైవే ఫ్లైఓవర్ ఉన్నాయని మహా మెట్రో ఎండీ బ్రిజేష్ దీక్షిత్ తెలిపారు. దిగువన ప్రస్తుతమున్న రోడ్డు కొనసాగుతుందని వివరించారు.
10/16
ఒక్కోసారి వాహనాలపై ప్రయాణం చేసే వారి తీరు చూస్తే భయమేస్తుంది. వారికేం అవుతుందోనని కంగారుపడతాం. మంగళవారం ఉదయం పెదవాల్తేరు రోడ్డులో ద్విచక్ర వాహనంపై బాలుడిని నిల్చోపెట్టి తీసుకువెళ్లారు. ఆ సమయంలో చూసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రయాణాలు ప్రమాదాలకు హేతువవుతాయని చర్చించుకున్నారు.
11/16
పంచభూత స్థలాలలో అగ్నిస్థలంగా పేరొందిన తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుని ఆలయంలో కార్తిక మహాదీపోత్సవం సందర్భంగా 2,668 అడుగుల ఎత్తున్న కొండపై మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు మహాదీపం వెలిగించారు. చిత్రంలో కొండపై వెలిగించిన మహాదీపం, భారీగా తరలివచ్చిన భక్తులు.
12/16
చెన్నై మహా నగరానికి ప్రత్యామ్నాయంగా కాంచీపురం జిల్లా పరందూరు పరిసర ప్రాంతాల్లో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంపై భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం దీని నిర్మాణానికి చకచకా పావులు కదుపుతోంది.
13/16
పార్వతీపురం జిల్లా వేణుగోపాలపురంలోని జిల్లా విద్యాశిక్షణ సంస్థలో నిర్వహిస్తున్న కళా ఉత్సవ్ జిల్లాస్థాయి పోటీలు మంగళవారం ముగిశాయి. సంగీతం, ఏకపాత్రాభినయం, చిత్రలేఖనంలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు 40 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అనంతరం విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
14/16
మధ్య ఆసియా, హిమాలయాల నుంచి కొల్లేరుకు వలస వచ్చే విశిష్ట అతిథి విష్కర్డ్ టేర్న్(మీసాల రీవు పిట్ట). 22 నుంచి 25 సెం.మీ పొడవుతో కాకి పరిమాణంలో 60 - 110 గ్రాముల బరువు ఉంటుంది. నీటిపై పది అడుగుల ఎత్తులో హెలికాప్టర్లా విహరిస్తూ తలను మాత్రమే నీటిలో ముంచి చిన్న చేపలను ముక్కుతో ఒడిసి పడుతుంది.
15/16
కర్రలపై విద్యుత్తు తీగలు ఏర్పాటు చేసిన ఈ దృశ్యం కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె పంచాయతీ పట్రపల్లి చెరువు సమీపంలోనిది. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు సరఫరా చేసేందుకు ఇలా ఏర్పాటు చేశారు. ఇవి నేలకొరిగి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.
16/16
అల్లూరి జిల్లాలోని మేఘాలకొండ మంచు అందాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మంగళవారం వేకువ జామున పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి చేరుకున్నారు. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)