చిత్రం చెప్పే విశేషాలు (23-05-2024)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
Updated : 23 May 2024 14:58 IST
1/17
ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసిన వేళ హరివిల్లు విరిసి ప్రజలను మురిపించింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెలో ఓ వైపు చిటపట చినుకులు పడుతుంటే.. మరో వైపు మేఘాలపై ఏర్పడిన ఇంద్రధనుస్సు చూపరులకు కనువిందు కల్గించింది.
2/17
హైదరాబాద్ జూబ్లిహిల్స్లోని లోటస్పాండ్ రెండో పార్కులో ఏర్పాటు చేసిన డైనోసార్ బొమ్మలు ధ్వంసమవుతున్నాయి. పార్కులో నిర్వహణ కొరవడడంతో పలుచోట్ల బొమ్మలు విరిగిపోయాయి.
3/17
నీటిలో చేపల వేటకు ఉపయోగించే తెప్పలే ఎండకు ఛత్రమయ్యాయి. ఏపీలోని రాజమండ్రి నుంచి మత్స్యకారులు తమ సామగ్రితో సహా సూర్యాపేటకు లారీలో వెళుతూ ఖమ్మం జిల్లా కల్లూరులో ఆగారు. లారీలో రెండు తెప్పలను గొడుగు మాదిరిగా ఏర్పాటు చేసి నీడలో ఉన్న ఈ దృశ్యాన్ని ‘న్యూస్టుడే’ క్లిక్మన్పించింది.
4/17
ఒకటీ రెండూ కాదు.. పదుల సంఖ్యలో జేసీబీ యంత్రాలు వరుసగా కన్పించడంతో జనం ఆసక్తిగా తిలకించారు. విజయవాడ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఓ గూడ్సురైలుపై వాటిని తరలిస్తుండగా.. ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్లో కొద్దిసేపు ఆగింది.
5/17
ముంజంపల్లిలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఘనంగా జరిగింది. అమ్మవారికి అభిషేకం, పట్నాలు, బోనాలు నిర్వహించారు. గీత కార్మికులందరూ కలిసి తాటి చెట్టు ఎక్కి కల్లు తీయడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు.
6/17
హైదరాబాద్: వినియోగదారులను ఆకట్టుకోవడమే వ్యాపారంలోని ప్రధాన సూత్రం. శామీర్పేట సమీపంలోని తూంకుంట వద్ద జాతీయ రహదారిపై వెళ్లే వారిని ఆకట్టుకునేందుకు ఓ హోటల్ నిర్వాహకులు పాత లారీ, జీపుతో ప్రవేశ ద్వారాన్ని ఇలా సుందరంగా తీర్చిదిద్దారు.
7/17
హైదరాబాద్: ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం చెంత ఏర్పాటుచేసిన మేళాను బుధవారం సాయంత్రం మేళాకు విచ్చేసిన చిన్నారులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.మేళాలో కశ్మీర్ మంచు కొండల్లో మంచు కురవడం, అక్కడి జంతువులు, నివాస సముదాయాలను కళ్లకు కట్టినట్లు రూపుదిద్దిన తీరు సందర్శకులను అలరిస్తోంది.
8/17
నిజామాబాద్: రెంజల్ మండలంలోని సాటాపూర్ నుంచి కందకుర్తికి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు పెరిగి వృక్షాలుగా మారాయి. పచ్చదనంతో కళకళలాడడమే కాకుండా వాహనదారులకు చల్లని నీడను అందిస్తున్నాయి. అప్పటి వరకు ఎండలో ప్రయాణించిన వాహనదారులు ఇక్కడకు రాగానే చెట్ల నీడన సేదతీరుతున్నారు.
9/17
ఆదిలాబాద్ జిల్లా అడవులకు పెట్టింది పేరు. ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న అందమైన అడవులే కనిపిస్తుంటాయి.ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల పెద్ద సంఖ్యలో చెట్లు ఆకులు రాలుస్తుంటాయి. అలా మొత్తం అడవంతా పచ్చదనం పోయి ఆకులు లేని చెట్లే కనిపిస్తాయి. అవి కూడా ప్రత్యేక అందాన్ని సంతరించుకున్నాయి. అలాంటి చిత్రమే ఇది.
10/17
హైదరాబాద్: బంజారాహిల్స్లోని కేబీఆర్ జాతీయ ఉద్యానవనంలో బుధవారం జీవ వైవిధ్య దినోత్సవాన్ని ‘బి పార్ట్ ఆఫ్ ది ప్లాన్’ పేరుతో సందడిగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
11/17
మహబూబ్నగర్: నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలు కత్వా(చెక్డ్యాం) నడి వేసవిలోనూ కనువిందు చేస్తోంది.మిట్ట మధ్యాహ్నం వేళ యువకులు అలుగు పారుతున్న చోట జలకాలాడుతూ, సెల్ఫీలు దిగుతూ సేద తీరుతున్నారు. ఈ దృశ్యాలను ‘ఈనాడు’ క్లిక్ మనిపించింది.
12/17
కడప: జమ్మలమడుగులో శ్రీదేవి, భూదేవి సమేత నారాపుర వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి హంస వాహనంపై వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తిలకించారు. ఆ చిత్రమే ఇది.
13/17
పౌర్ణమి పర్వదినం సందర్భంగా వరంగల్ ఎంజీఎం కూడలిలోని శ్రీరాజరాజేశ్వరీ దేవికి బుధవారం రాత్రి మల్లెలతో పుష్పార్చన నిర్వహించారు. అర్చకుడు లక్ష్మణ్శర్మ ఆధ్వర్యంలో మహిళలతో అమ్మవారికి సౌందర్య లహరి, లలితా సహస్ర పారాయణం చేయించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.
14/17
మహబూబ్నగర్: సాధారణంగా రైలు బోగీలు పట్టాలపై నడుస్తాయి. కానీ భారీ ట్రక్కుపై బెంగళూరు వైపు నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తున్న రైలు బోగీ బుధవారం జడ్చర్ల - రాజాపూర్ మధ్య జాతీయ రహదారి-44పై కనిపించింది. ఈ దృశ్యాన్ని ‘న్యూస్టుడే’ కెమెరాలో బంధించింది.
15/17
హైదరాబాద్: అడపాదడపా అకాల వర్షాలతో పాటు ఎండలూ మండుతున్నాయి. నగర శివారు పెద్ద అంబర్పేట వద్ద నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న కార్మికులు తాటి మట్టలతో స్వయంగా టోపీలు తయారు చేసుకుని ఎండ నుంచి ఇలా రక్షణ పొందుతూ కనిపించారు.
16/17
నెల్లూరు: ‘అహింసా పరమో ధర్మః ’ అన్న బుద్ధభగవానుడి జయంతి సందర్భంగా పొదలకూరు మండలం మహ్మదాపురం గ్రామవాసి విశ్రాంత చిత్రలేఖన ఉపాధ్యాయుడు పచ్చా పెంచలయ్య బుధవారం రావి ఆకుపై బుద్ధుడి వర్ణచిత్రాన్ని అత్యంత శోభాయమానంగా చిత్రీకరించారు. పలువురిని విశేషంగా ఆకట్టుకుంది.
17/17
హైదరాబాద్: చిత్రంలో కనిపిస్తున్న బంగారు వర్ణ వడ్రంగి పిట్టలు నగర శివారు కుంట్లూరులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో కనిపించాయి.దట్టమైన అడవుల్లో మామిడి, మద్ది, కొబ్బరి వంటి పొడవైన చెట్ల బెరడు తొలచి పురుగుల్ని ఆహారంగా తీసుకుంటాయి. ‘ఈనాడు’ కెమెరాకు చిక్కిన చిత్రమిది.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ దళాలకు ఎదురుదెబ్బ.. 8 మంది సైనికులు మృతి
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/06/24)
-
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
-
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!