Amaravati: రాజధాని నిర్మాణానికి మరో ₹ 32,500 కోట్ల రుణం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 04 Nov 2025 05:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ప్రపంచ బ్యాంకు-ఏడీబీ నుంచి రూ.14 వేల కోట్లు
నాబార్డు, ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ, ఏపీపీఎఫ్‌సీ నుంచి మిగతా నిధులు

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) మరో రూ.32,500 కోట్లు రుణం తీసుకోనుంది. ప్రపంచ బ్యాంకు- ఆసియా అభివృద్ధి బ్యాంకుల కన్సార్షియంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఏపీపీఎఫ్‌సీ), నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ), నాబార్డ్‌ నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ (ఎన్‌ఐడీఏ) కింద రుణం సమీకరించనుంది. రూ.1,500 కోట్ల రుణానికి సంబంధించి ఏపీపీఎఫ్‌సీతో ఇప్పటికే ఒప్పందం కుదిరింది. మిగతా సంస్థలతోనూ సంప్రదింపుల ప్రక్రియ ముగిసింది. రుణం మంజూరుకు ఆ సంస్థలు అంగీకారం తెలిపాయి. ప్రపంచ బ్యాంకు- ఏడీబీ మరో రూ.14 వేల కోట్లు, ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ రూ.10 వేల కోట్లు, నాబార్డు రూ.7,000 కోట్లు రుణం మంజూరు చేయనున్నాయి. సీఆర్డీఏ ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి రూ.15,000 కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు కలిపి మొత్తం రూ.26,000 కోట్ల రుణం తీసుకుంది.

ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మళ్లీ రుణం 

రాజధాని అమరావతి ప్రాజెక్టుపై ప్రపంచ బ్యాంకు మొదటి నుంచీ సానుకూలంగా ఉంది. రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు 2019కి ముందే ఆ సంస్థ సిద్ధమైంది. అప్పట్లో ఏఐఐబీతో కలసి రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చాక రాజధాని పనుల్ని నిలిపేసిన జగన్‌ ప్రభుత్వం.. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది. 2024 జూన్‌లో కూటమి అధికారంలోకి వచ్చాక.. కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపడంతో శరవేగంగా రూ.15,000 కోట్లు రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. ఈ మొత్తంలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిసి సుమారు రూ.13,500 కోట్లు ఇస్తుండగా, రూ.1,500 కోట్లు మ్యాచింగ్‌ గ్రాంట్‌ను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోంది. రాజధాని నిర్మాణానికి మరో 1.6 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.14 వేల కోట్లు) రుణం ఇచ్చేందుకు కూడా ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ముందుకొచ్చాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఈ వారంలోనే కేంద్ర ఆర్థికశాఖకు అందజేయనుంది. అక్కడి నుంచి అది ప్రపంచ బ్యాంకు, ఏడీబీల బోర్డుల ఆమోదం కోసం వెళుతుంది. రూ.14,000 కోట్లలో కొంత మొత్తాన్ని మ్యాచింగ్‌ గ్రాంట్‌గా సమకూర్చాల్సి ఉంటుంది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలా? అన్న విషయంలో స్పష్టత రాలేదు. అమరావతి నిర్మాణంపై దేశీయ ఆర్థిక సంస్థలు కూడా ఆసక్తిగా ఉన్నాయనడానికి.. నాబార్డ్, ఏన్‌ఏబీఎఫ్‌ఐడీ వంటి సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడమే నిదర్శనం. 

చాలావరకు నిధులు సమకూరినట్లే!

  • రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రూ.91,639 కోట్ల అంచనా వ్యయంతో 112 పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
  • వాటిలో ప్రధాన మౌలిక వసతుల అభివృద్ధి, రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్‌ల అభివృద్ధి, ప్రభుత్వ పరిపాలన నగరంలో నిర్మించే హైకోర్టు, సచివాలయం టవర్లు, శాసనసభ భవనం వంటి ఐకానిక్‌ నిర్మాణాలు, హైకోర్టు  న్యాయమూర్తులు, మంత్రులు, అధికారుల నివాస గృహాలు వంటి 87 పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. వీటి అంచనా వ్యయం రూ.53,388 కోట్లు. 
  • వీటిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి తీసుకుంటున్న రూ.15,000 కోట్లతో 30 పనులు, హడ్కో నిధులతో 50 పనులు చేపడుతున్నారు. 
  • రూ.38,926 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
  • ప్రపంచ బ్యాంకు- ఏడీబీ మంజూరు చేసిన రుణంలో రూ.4,285 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి.
  • హడ్కో రూ.11 వేల కోట్ల రుణంలో ఇప్పటికే రూ.2,750 కోట్లు విడుదలయ్యాయి. మిగతా నిధులు దశల వారీగా అందనున్నాయి.
  • ఇప్పుడు తీసుకోబోయే రూ.32,500 కోట్ల రుణంతో రాజధాని నిర్మాణానికి చాలావరకు నిధులు సమకూరినట్లవుతుంది. దీంతో అన్ని పనుల్ని శరవేగంగా పరుగులు పెట్టించేందుకు వీలు కలుగుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు