నీట్‌ యూజీ రాష్ట్ర ర్యాంకర్ల జాబితా విడుదల

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 08 Jul 2025 04:26 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, అమరావతి: నీట్‌ యూజీ-2025లో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం రాత్రి ప్రకటించింది. రాష్ట్రం నుంచి 57,934 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 36,776 మంది కనీస మార్కులు సాధించి.. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించారు. ధిల్లీ నుంచి అందిన సమాచారం మేరకు రాష్ట్రం నుంచి వరుస క్రమంలో ర్యాంకులు పొందిన విద్యార్థుల జాబితాను విశ్వవిద్యాలయం వెల్లడించింది. ప్రవేశాల దరఖాస్తుల స్వీకరణ తేదీల నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేస్తామని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వి.రాధికారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ వైద్య కమిషన్‌ మార్గదర్శకాలు, ప్రవేశాల షెడ్యూలును అనుసరించి రాష్ట్ర స్థాయిలో నోటిఫికేషన్‌ ఇస్తామని వెల్లడించారు. రిజర్వేషన్‌ మార్గదర్శకాల ప్రకారం ప్రకటించిన ప్రొవిజినల్‌ విద్యార్థుల జాబితాలో స్వల్పమార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు.

19వ ర్యాంకుతో ప్రారంభం..

రాష్ట్రం నుంచి తొలి ర్యాంకు 19తో ప్రారంభమైంది. ఈ విద్యార్థికి 669 మార్కులు వచ్చాయి. అర్హత సాధించిన వారిలో చివరి విద్యార్థి 113 మార్కులతో 13,19,140 ర్యాంకు దక్కించుకున్నారు. విశ్వవిద్యాలయం ప్రకటించిన జాబితాలో జాతీయ స్థాయిలో తొలి 100 ర్యాంకులు పొందిన వారిలో రాష్ట్రం నుంచి ఆరుగురు ఉంటే.. 207లోపు ర్యాంకుల్లో 11 మంది విద్యార్థులు ఉన్నారు. గతేడాది వరకు విశ్వవిద్యాలయం విద్యార్థుల పేర్లతో ర్యాంకులు ప్రకటించేది. ఈ అవకాశాన్ని మధ్యవర్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటుండటంతో ఈ సారి రోల్‌ నంబర్ల వారీగా ర్యాంకులు ప్రకటించినట్లు విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు