తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 03 Nov 2025 04:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి, ఓ ప్రకటన విడుదల చేశారు. ఘటనను వక్రీకరించి కొందరు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేశారని, ఆ పోస్టులను తీవ్రంగా పరిగణించి లొకేషన్‌ ఆధారంగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరుగుతోందన్నారు.

ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శిస్తున్న పీవీఎన్‌ మాధవ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ తదితరులు

బాధితులకు నేతల పరామర్శ

పలాస, కాశీబుగ్గ, శ్రీకాకుళం గ్రామీణం, న్యూస్‌టుడే: పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట దుర్ఘటన క్షతగాత్రులను ఎన్డీయే, విశ్వహిందూ పరిషత్తుతోపాటు వివిధ పార్టీల నాయకులు ఆదివారం పరామర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరావు, భాజపా రాష్ట్ర కార్యదర్శి సురేంద్రమోహన్, జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు బాధితులతో మాట్లాడి వారికి భరోసానిచ్చారు.

పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం, కె.కన్నబాబు, సీదిరి అప్పలరాజు

సిటింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలి: బొత్స

వైకాపా నేతలు.. శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, కె.కన్నబాబు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ తదితరులు బాధితులను పరామర్శించారు. బొత్స మాట్లాడుతూ ‘అది ప్రైవేటు ఆలయం, మేమేం నిర్ణయం తీసుకుంటాం’ అని అనంతపురంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమన్నారు. ఘటనపై సిటింగ్‌ జడ్జి లేదా విశ్రాంత న్యాయమూర్తితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. వైకాపా తరఫున రూ.2 లక్షల నష్టపరిహారం మాజీ సీఎం జగన్‌ ప్రకటించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు