Google: విశాఖలో ‘గూగుల్‌’ డేటా సెంటర్‌

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 29 Aug 2025 06:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

రూ.50 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న సంస్థ 
మన డేటా ఇక్కడే భద్రం 
సుమారు 25 వేలమందికి ఉపాధి

ఈనాడు, అమరావతి: ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్‌ విశాఖలో అడుగుపెడుతోంది. ఆ సంస్థ సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ కానుంది. గూగుల్‌ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రానికి విశాఖ వేదిక కానుంది. గూగుల్‌ ప్రతిపాదనపై కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్వెస్ట్‌ ఇండియా ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ‘గూగుల్‌ ప్రతిపాదన గేమ్‌ ఛేంజర్‌ కానుంది. ప్రపంచానికి డిజిటల్‌ హబ్‌గా దేశానికి గుర్తింపు వస్తుంది’ అని జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహక, సమన్వయ సంస్థ ఇన్వెస్ట్‌ ఇండియా పేర్కొంది. ఆ సంస్థ చేసిన పోస్ట్‌తో ప్రపంచం దృష్టి ఏపీపై పడింది. గూగుల్‌ క్లౌడ్, సెర్చ్, యూట్యూబ్, ఏఐ వర్క్‌ల పర్యావరణ వ్యవస్థ బలోపేతం చేసేందుకు ఈ డేటా సెంటర్‌ ఉపయోగపడనుంది. పరిశ్రమలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఏఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

మన డేటా భద్రం 

  • విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటైతే మన దేశానికి చెందిన డేటా ఇక్కడే నిల్వ అవుతుంది. దీనివల్ల డేటా చౌర్యం అనే భయం ఉండదు. 
  • అంతర్జాతీయ బ్యాండ్‌విడ్త్‌ను పెంచేందుకు 3 సబ్‌ మెరైన్‌ కేబుల్స్‌కు సరిపడా ల్యాండింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి డేటా సెంటర్‌ను అనుసంధానిస్తుంది. 
  • ముంబయిలో గూగుల్‌కు చెందిన పియరింగ్, క్యాచీ సర్వర్లు ఉన్నాయి.. అక్కడి నుంచి సముద్ర మార్గంలో కేబుల్‌ తీసుకోవడంసులువు. డార్క్‌ ఫైబర్‌ ద్వారా తక్కువ ఖర్చుతో తీసుకోవడం సాధ్యం అవుతుంది.  
  • డేటా సెంటర్‌ కూలింగ్‌ కోసం పెద్దఎత్తున నీరు అవసరం. అందుకే డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం గూగుల్‌ విశాఖ సముద్ర తీరాన్ని ఎంపిక చేసుకుంది. 

సుమారు 25 వేల మందికి ఉపాధి 

ఐటీ రంగంలో రూ.2 కోట్ల పెట్టుబడి పెడితే ఒకరికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఆ లెక్కన గూగుల్‌ సంస్థ పెట్టే సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడుల ఆధారంగా సుమారు 25 వేలమందికి దశలవారీగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా. పరోక్షంగా మరో 50 వేలమందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. 

తీరం దగ్గరే విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు  

డేటా సెంటర్‌ కోసం పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించాలని గూగుల్‌ నిర్ణయించింది. డేటా సెంటర్‌ కూలింగ్‌.. నిర్వహణకు ఎక్కువ విద్యుత్‌ అవసరం. ఆ విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.20 వేల కోట్లను ఖర్చు చేయనుంది. సముద్ర తీరం వెంట చిన్న హైడ్రో ప్రాజెక్టులు (సముద్రపు అలల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి) ఏర్పాటు చేసి.. వాటి ద్వారా వచ్చే విద్యుత్‌ను గూగుల్‌ వినియోగించుకునే అవకాశం ఉంది. అమెరికాలో కొన్ని సంస్థలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి.

Tags :
Published : 29 Aug 2025 06:05 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు