పాలే లేని.. పాపాల నెయ్యి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 24 Jan 2026 06:10 IST
Ee
Font size
  • A
  • A+
  • A++
4 min read

అక్షరాలా 60 లక్షల కిలోల సరఫరా
2019-24 మధ్య దానితోనే 20 కోట్ల శ్రీవారి లడ్డూల తయారీ 
వైకాపా పాలనలో కుంభకోణం 
రూ.235 కోట్లు దుర్వినియోగం 
డెయిరీలతో చేతులు కలిపిన తితిదే ఇంటిదొంగలు 
వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న డెయిరీల ప్రతినిధులతో బేరసారాలు 
హవాలా మార్గాల్లో లంచాల స్వీకరణ
తేల్చిచెప్పిన సిట్‌ 
600 పేజీలతో తుది అభియోగపత్రం దాఖలు

ఈనాడు - అమరావతి, తిరుపతి; న్యూస్‌టుడే- తిరుపతి (నేర విభాగం): వైకాపా హయాంలో 2019-24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు నెయ్యే కాని దాన్ని నెయ్యి పేరిట సరఫరా చేశారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ నిగ్గు తేల్చింది. పాలే లేకుండా పామాయిల్, పామ్‌ కర్నెల్‌ ఆయిల్‌తో సిద్ధం చేసిన పదార్థాన్నే నెయ్యి ముసుగులో సరఫరా చేశారని పేర్కొంది. దానికి నెయ్యి సువాసనలు వచ్చేలా చేసేందుకు బీటాకెరోటిన్‌ లాంటి రసాయనాలను కలిపారని తేల్చింది. ఇలా ఐదేళ్ల వ్యవధిలో ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని వెల్లడించింది. దీంతోనే 20.01 కోట్ల శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారుచేశారని తెలిపింది. ఈ కుంభకోణంలో రూ.235 కోట్ల తితిదే నిధుల దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా, కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వివరించింది. కొంతమంది తితిదే ఉద్యోగులు, అధికారులు, డెయిరీ సంస్థల ప్రతినిధులతో కుమ్మక్కై ఈ కల్తీ నెయ్యి సరఫరాలో భాగస్వాములయ్యారని పేర్కొంది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్‌ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో శుక్రవారం తుది అభియోగపత్రం (ఛార్జ్‌షీట్‌) దాఖలు చేశారు. 600 పేజీలకు పైగా ఉన్న ఈ అభియోగపత్రంలో 36 మంది నిందితుల ప్రమేయాన్ని స్పష్టంగా వివరించారు. ఈ జాబితాలో తితిదే ఉద్యోగులు, అధికారులతో పాటు పలువురు డెయిరీ సంస్థల ప్రతినిధులున్నారు.

కిలోకు రూ.25 చొప్పున లంచం డిమాండ్‌

తితిదే అప్పటి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ కె.చిన్న అప్పన్న డెయిరీ సంస్థల ప్రతినిధులతో బేరసారాలు జరిపి, హవాలా మార్గాల్లో లంచాలు తీసుకున్నారంటూ ఆ లావాదేవీల్ని సిట్‌ అభియోగపత్రంలో పొందుపరిచినట్లు సమాచారం. చిన్న అప్పన్న బ్యాంకు ఖాతాల్లో 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్లలో రూ.4.69 కోట్లు జమ కాగా అందులో రూ.4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థల నుంచి చిన్న అప్పన్న కిలోకు రూ.25 చొప్పున లంచం డిమాండ్‌ చేసి అందుకున్నట్లు అభియోగాలున్నాయి. సిట్‌ ఈ వివరాలన్నీ అభియోగపత్రంలో పేర్కొన్నట్లు తెలిసింది. ఏఆర్‌ డెయిరీ, వైష్ణవి డెయిరీ, భోలేబాబా తదితర సంస్థలతో పాటు వాటి ప్రతినిధులు కల్తీ నెయ్యి సరఫరాలో ఎలా భాగస్వాములయ్యారో సిట్‌ ఛార్జ్‌షీట్‌లోఅభియోగపత్రంలో వివరించింది. 

టెండర్ల నిబంధనల సడలింపుతో కల్తీకి రాచబాట

తిరుమలకు నెయ్యి సరఫరా చేసే టెండర్లలో పాల్గొనేందుకు కఠిన నిబంధనలు ఉండేవి. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిబంధనల్ని పూర్తిగా సడలించేశారు. టెండర్లలో పాల్గొనే డెయిరీ పాలు సేకరించాల్సిన పనిలేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేదని, డెయిరీ మూడేళ్ల కార్యకలాపాలు చేయక్కర్లేదని, ఏడాది చాలని, రూ.250 కోట్ల టర్నోవర్‌ అవసరం లేదని, రూ.150 కోట్లు ఉంటే చాలని నిబంధనలు మార్చేసింది. వైవీ సుబ్బారెడ్డి తితిదే పాలకమండలి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. ఈ నిబంధనల సడలింపు వల్లే కల్తీ నెయ్యి సరఫరా సంస్థలకు అవకాశమిచ్చినట్లయ్యిందని సిట్‌ అభియోగపత్రంలో పొందుపరిచినట్లు తెలిసింది. 

సుబ్బారెడ్డి, భూమన, చెవిరెడ్డిల విచారణ

ఈ కేసు దర్యాప్తులో భాగంగా అప్పటి తితిదే ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలతో పాటు తితిదే అప్పటి ఈవో ధర్మారెడ్డిని సిట్‌ అధికారులు విచారించారు. తితిదే పాలకమండలిలో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అప్పట్లో కొనుగోలు కమిటీలో సభ్యులుగా ఉన్న ప్రస్తుత మంత్రి కొలుసు పార్థసారథి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలనూ ప్రశ్నించారు. ఆ విచారణ అంశాలనూ అభియోగపత్రంలో పొందుపరిచినట్లు తెలిసింది. 

14 నెలల పాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు

  • సిట్‌ అధికారులు మొత్తం 14 నెలలపాటు ఈ  కేసు దర్యాప్తు చేశారు. 12 రాష్ట్రాల్లో సోదాలు చేశారు. గతేడాది మే నెలలో తొలి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినప్పుడు 24 మందిని నిందితులుగా చేర్చారు. నవంబరు 23న కోర్టుకు సమర్పించిన మెమోలో తితిదే ఉద్యోగులు, డెయిరీ నిపుణులు కలిపి మరో 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ 36 మంది నిందితుల ప్రమేయంపైనా తాజా అభియోగపత్రంలో స్పష్టంగా వివరించారు.
  • తమిళనాడు దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ నుంచి దర్యాప్తు మొదలైంది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులుగా భోలేబాబా ఓరోగానిక్‌ డెయిరీ డైరెక్టర్లు పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్‌ ఉన్నారని తేలింది. వీరు దిల్లీ, హరియాణా, రాజస్థాన్‌ల నుంచి రసాయనాలు తెప్పించి, ఉత్తరాఖండ్‌లోనే కల్తీ నెయ్యి తయారుచేసి పంపారని విచారణలో వెల్లడైంది. అనంతరం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో నిందితులను గుర్తించారు.
  • ఈ కేసులో తొలుత గతేడాది ఫిబ్రవరి 9న ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజురాజశేఖరన్, పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్, అపూర్వ వినయ్‌కాంత్‌ చావ్డాలను.. అనంతరం అజయ్‌కుమార్‌ సుగంధ్, ఆశిష్‌ అగర్వాల్, హరిమోహన్‌రాణాలను అరెస్ట్‌ చేశారు. 
  • కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్, వైష్ణవి, మాల్‌గంగ, భోలేబాబా డెయిరీలకు రూ.251 కోట్లు తితిదే సొమ్మును చెల్లించారు. ఈ వివరాలన్నీ అభియోగపత్రంలో పొందుపరిచినట్లు సమాచారం.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

లైవ్ టీవీ