logo

అమ్మహస్తం సరకులు.. లబ్ధిదారుల్లో ఆశలు!

చౌకధరల దుకాణాల ద్వారా బియ్యంతో పాటు నిత్యావసర సరకులు సైతం అందించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో పేద కుటుంబాలపై ఆర్థికభారం పడుతోంది.

Published : 28 May 2024 02:20 IST

బియ్యంతోపాటు అందజేయాలని ప్రభుత్వ యోచన

కోటపల్లి మండలం రాపన్‌పల్లిలో రేషన్‌ దుకాణంలో వినియోగదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్‌ 

న్యూస్‌టుడే, చెన్నూరు గ్రామీణం, ఏసీసీ: చౌకధరల దుకాణాల ద్వారా బియ్యంతో పాటు నిత్యావసర సరకులు సైతం అందించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో పేద కుటుంబాలపై ఆర్థికభారం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పంపిణీ ద్వారా నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి సమీక్ష 

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పౌరసరఫరాల, మార్కెటింగ్‌ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్‌కార్డుల జారీతో పాటు బియ్యం, తొమ్మిది రకాల సరకుల పంపిణీ అంశంపై చర్చించారు. దీనిపై ముఖ్యమంత్రి నివేదిక కోరినట్లు సమాచారం. ఈ అంశం కార్యరూపం దాల్చితే ఉమ్మడి జిల్లాలోని పేదలకు బియ్యంతో పాటు నిత్యావసర సరకులు అందే అవకాశం ఏర్పడుతుంది. ఉమ్మడి జిల్లాలో 1,505 చౌకధరల దుకాణాలు ఉండగా 7,60,627 తెల్లకార్డులున్నాయి. వీరికి ప్రతినెల బియ్యం మాత్రమే అందజేస్తున్నారు.

తెరపైకి తొమ్మిది రకాల వస్తువులు

రేషన్‌ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర సరకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రూపాయికి కిలో బియ్యం కరోనా తర్వాత ఉచితంగా అందిస్తున్నారు. బియ్యంతో పాటు పప్పు, నూనె, కారంపొడి, చింతపండు, పసుపు, ఉల్లిగడ్డ, చక్కెర, ఉప్పు వంటి సరకులను కూడా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఉగాది సందర్భంగా అమ్మహస్తం పేరిట నిత్యావసర సరకుల పంపిణీని ప్రారంభించారు. ఆ సమయంలో తక్కువ ధరకు బియ్యంతో పాటు కిలో చొప్పున ఉల్లిగడ్డలు, వంటనూనె, కారంపొడి, ఉప్పు, చింతపండు, చక్కెర, పసుపు ప్యాకెట్‌లను పంపిణీ చేశారు. అలా పంపిణీ చేసిన సరకులు పేద కుటుంబాలకు ఎంతో ఉపకరించేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమ్మహస్తం పథకాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి బియ్యం మాత్రమే అందిస్తున్నారు. నిత్యావసర వస్తువులను మార్కెట్‌లో కొనుగోలు చేయడంతో పేదలపై ఆర్థికభారం పడుతోంది.

తగ్గనున్న ఆర్థిక భారం

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలో మాదిరిగానే తిరిగి చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని భావిస్తోంది. తద్వారా నిరుపేదలపై ఆర్థికభారం పడకుండా ఉంటుందని ఆలోచిస్తున్న ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని పునః ప్రారంభానికి అనవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో బియ్యంతో పాటు గోధుమలు, కూడా పంపిణీ చేసేవారు. నిత్యావసరాలతో పాటు ఇంకా ఏమైనా పంపిణీ చేయవచ్చా? అనే కోణంలో ఆలోచిస్తున్నారు. రేషన్‌దుకాణాల ద్వారా నిత్యావసర సరకులు పంపిణీ చేస్తే పేదలకు ఆర్థికభారం చాలావరకు తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని