logo

కూటమి అధికారంలోకొస్తే మెగా డీఎస్సీ

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని పాడేరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కిల్లు వెంకటరమేష్‌నాయుడు పేర్కొన్నారు.

Published : 13 Apr 2024 01:21 IST

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని పాడేరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కిల్లు వెంకటరమేష్‌నాయుడు పేర్కొన్నారు. వంచుల, జర్రెల, మొండిగెడ్డ గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో యువత, మహిళలతో మాట్లాడారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన వైకాపా నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు చూపలేదన్నారు. కనీసం మెగా డీఎస్సీ ప్రకటించలేదన్నారు. ఎన్నికల సమయంలో కేవలం 6 వేల పోస్టులతో ప్రకటన చేసిందని చెప్పారు. యువతపై తెదేపా, జనసేన, భాజపాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయన్నారు. అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తామని అధినేత చంద్రబాబు ప్రకటించారని గుర్తుచేశారు. యువత కూటమి విజయానికి తోడ్పాటు అందించాలని కోరారు. దేవరాపల్లి సర్పంచి బుజ్జిబాబు, భాజపా అసెంబ్లీ కన్వీనర్‌ కూడా కృష్ణారావు, నాయకుడు చిరంజీవి, జనసేన మండల అధ్యక్షుడు కొయ్యం బాలరాజు, కన్వీనర్‌ సిద్దార్ధ్‌మార్క్‌, కూటమి సమన్వయ కమిటీ సభ్యులు నర్సింహమూర్తినాయుడు, తెదేపా అధికార ప్రతినిధి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


కూటమి అభ్యర్థి గెలుపే ధ్యేయం

జి.మాడుగుల, న్యూస్‌టుడే: కూటమి అభ్యర్థి గెలుపే ధ్యేయంగా పనిచేయాలని కూటమి పార్టీల మండలాధ్యక్షుడు పిన్నయ్య పేర్కొన్నారు. జి.మాడుగుల మండల కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. తెదేపా ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు చేరువ చేయాలన్నారు. భాజపా, తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. జనసేన పార్టీ మండలాధ్యక్షుడు భీమన్న, భాజపా మండలాధ్యక్షుడు నూకరాజు, తెదేపా నాయకులు కళ్యాణం, నాగబ్బాయి, భీంబాబు, బాబి, రాజు, బాబూరావు, కొండలరావు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


కూటమి విజయానికి కృషి చేద్దాం

హుకుంపేట, న్యూస్‌టుడే: అరకులోయ నియోజకవర్గంలో కూటమి విజయానికి నాయకులు, కార్యకర్తలు కలసి పని చేయాలని భాజపా మండల అధ్యక్షుడు గసన్న పేర్కొన్నారు. స్థానిక కామయ్యపేట కూడలి వద్ద భాజపా కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి విజయం సాధించాలని ప్రచారాలు నిర్వహించాలని కోరారు. తెదేపా మండల అధ్యక్షుడు తులసీరావు, నాయకులు చెట్టి లక్ష్మణుడు, సర్పంచు శాంతికుమారి, రామారాజు, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


నేడు కూటమి సమావేశం

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: మండలంలోని అంజోడలో కూటమి సమావేశాన్ని శనివారం నిర్వహించనున్నామని తెదేపా మండల అధ్యక్షుడు తుడుము సుబ్బారావు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కార్యాచరణ రూపొందించనున్నట్లు చెప్పారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, బూత్‌, క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు తప్పక హాజరుకావాలని ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని