logo

రెండు నెలలు.. రూ. 3.89 కోట్లు

రెండు నెలలు.. రూ. 3.89 కోట్లుఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు.

Published : 20 May 2024 02:11 IST

ఎన్నికల నేపథ్యంలో స్వాధీనం
పాడేరు, నక్కపల్లి, న్యూస్‌టుడే

కాగిత వద్ద పట్టుకున్న భారీ నగదు చూపుతున్న పోలీసులు

ఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు.

మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చెక్‌పోస్టుల ఏర్పాటుతోపాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, విజిలెన్స్‌ తదితర విభాగాలు తనిఖీల పేరిట రంగంలోకి దిగాయి. ఎన్నికల ముందు నుంచే నక్కపల్లి మండలం కాగిత వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఆ మేరకు అన్ని చోట్ల విస్తృత తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా ఎటువంటి ఆధారాలు, అనుమతులు లేకుండా అక్రమంగా తరలించే నగదు, మద్యం, గంజాయి తదితర వాటిని పట్టుకున్నారు. జిల్లాలో చెక్‌పోస్టుల పనితీరును స్వయంగా కలెక్టర్‌ రవి, ఎస్పీ మురళీకృష్ణ పలుమార్లు తనిఖీ చేయడంతోపాటు సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఇంక ఈ తనిఖీల్లో 1040 కేసులు నమోదు చేసి, 1273 మందిని అరెస్టు చేయగా, దాదాపు రూ. 3.89కోట్ల విలువైన సామగ్రిని పట్టుకున్నారు. కోడ్‌ రావడానికి ముందే కాగిత టోల్‌గేట్‌ వద్ద తనిఖీల ద్వారా పోలీసులు రూ. 2.07 కోట్ల నగదు పట్టుకున్నారు. దీనికి ఏ ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేశారు. ఈ రెండు నెలల్లో పట్టుకున్న దానికి ఇది అదనం. ఎలమంచిలి మండలం సోమలింగంపాలెం వద్ద గడ్డివాములో దాచిన రూ. 49 లక్షలకుపైగా విలువైన 39 వేల పైచిలుకు మద్యం సీసాలను పట్టుకున్నారు. దీనికి తోడు వివిధ ప్రాంతాల్లో గంజాయి, మద్యం, ప్రలోభాలకు గురి చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.


కోడ్‌ ఉల్లంఘనపైనా కేసులు

అల్లూరి జిల్లాలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై 24 కేసులు నమోదు చేశామని ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు. అక్రమ మద్యంపై 34 కేసులు నమోదు చేశారు. 4776 లీటర్ల నాటు సారా, 2740 లీటర్ల మద్యం సీజ్‌ చేశారు. 2,424 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చెక్‌పోస్టుల వద్ద ఎస్‌ఎస్‌టీ బృందాలు 23 కేసులు నమోదు చేశాయి. ఆయా బృందాలు రూ.1,98,400 నగదు, 35 లీటర్ల నాటుసారా, 90 లీటర్ల మద్యం, 32.50 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాయి. జిల్లాలోని తొమ్మిది ప్రాంతాల్లో చెక్‌గేట్లు ఏర్పాటు చేశారు. సుమారు 100 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు