logo

ఖాళీ పోస్టులపై సర్కారు కట్టుకథలు

గిరిజన నిరుద్యోగ యువతను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని తెదేపా అరకులోయ నియోజకవర్గ సమన్వయకర్త దొన్నుదొర విమర్శించారు.

Published : 23 Feb 2024 01:30 IST

మాట్లాడుతున్న తెదేపా అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త దొన్నుదొర తదితరులు

అరకులోయ, న్యూస్‌టుడే: గిరిజన నిరుద్యోగ యువతను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని తెదేపా అరకులోయ నియోజకవర్గ సమన్వయకర్త దొన్నుదొర విమర్శించారు. అరకులోయలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉంటే కొన్ని పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చారని పేర్కొన్నారు. ఆదివాసీలను విద్యకు దూరం చేసేందుకే పోస్టులు భర్తీ చేయడం లేదని ఆరోపించారు. గిరి విద్యార్థులకు నాణ్యమైన విద్య పొందే హక్కు లేదా అని ప్రశ్నించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌లో పీఈటీ, ఆర్ట్స్‌ కోర్సుల ఖాళీలను చూపించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. గురుకులాల్లో 1534 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 500 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇవ్వడం సమంజసం కాదని చెప్పారు. వైకాపా ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతిపై దృష్టి సారించడం లేదని విమర్శించారు.

జర్నలిస్టులపై దాడులు హేయం: రాష్ట్రంలో జర్నలిస్టులు, పత్రికా కార్యాలయాలపై దాడులు హేయమని దొన్నుదొర విమర్శించారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే జర్నలిస్టులపై భౌతిక దాడులకు దిగటం అమానుషమన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని అనుమానం వస్తోందన్నారు. వైకాపా మూకలు దాడులు చేస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు చోద్యం చూడటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. తెదేపా నాయకులు శెట్టి బాబూరావు, అమ్మన్న, వంతల నాగేశ్వరరావు, సాయిరాం, దొన్ను, కిల్లో కుమార్‌, కిల్లో ఆనంద్‌, చందు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు