logo

AP Election Counting: 4 గంటల్లోనే నందిగామ ఫలితం.. ఆ తర్వాత మచిలీపట్నం, పెడన

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం గట్టి ఏర్పాట్లు చేస్తోంది. జూన్‌ 4న ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ పోస్టల్‌ బ్యాలట్లతో మొదలవుతుంది.

Updated : 28 May 2024 10:00 IST

ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు
ఓట్ల లెక్కింపునకు యంత్రాంగం ఏర్పాట్లు

ఈనాడు - అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం గట్టి ఏర్పాట్లు చేస్తోంది. జూన్‌ 4న ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ పోస్టల్‌ బ్యాలట్లతో మొదలవుతుంది. 8.30 గంటల నుంచి ఈవీఎం (కంట్రోల్‌ యూనిట్లు)లను లెక్కిస్తారు. తొలి ఫలితం.. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం లేదా పామర్రు నియోజకవర్గం నుంచి, ఎన్టీఆర్‌ జిల్లాలో నందిగామ నుంచి రావొచ్చని అంచనా.  

  • ఎన్నికల సంఘ ప్రమాణాల ప్రకారం ఓట్ల లెక్కింపునకు నిర్దిష్ట సంఖ్యలో టేబుళ్లను ఏర్పాటు చేయాలి. 2019 ఉమ్మడి జిల్లా ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో 14 టేబుళ్లకు సరిపడా హాలుల్లేవంటూ నాటి ఎన్నికల అధికారి 8, 10 టేబుళ్ల చొప్పున ఇష్టానుసారం ఏర్పాటు చేయించారు. దీంతో ఫలితాల వెల్లడిలో జాప్యం చోటుచేసుకుంది. ఈసారి మాత్రం ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.
  • కృష్ణా యూనివర్సిటీ, నిమ్రా, నోవా కళాశాలల్లో విశాలమైన స్థలం అందుబాటులో ఉన్నందున అన్ని నియోజకవర్గాలకూ 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రౌండ్ల సంఖ్య గత ఎన్నికలకంటే తగ్గిపోయింది. పోటీలో ఉన్న అభ్యర్థులు, పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను బట్టి ఫలితం వెల్లడి సమయం ఉంటుంది.
  • లోక్‌సభ స్థానం, శాసనసభ స్థానాలకు టేబుళ్లు పక్కపక్కనే ఉంటాయి.
  • ఒక్కో రౌండ్‌లో 14 ఈవీఎంలు (కంట్రోల్‌ యూనిట్లు - సీయూ) లెక్కిస్తారు. ఇలా నియోజకవర్గంలో మొత్తం పోలింగ్‌ కేంద్రాల ప్రకారం సీయూలు ఉంటాయి. ఈ ప్రకారం రౌండ్లవారీ ఫలితాలను వెల్లడిస్తారు.
  • ఒక్కో రౌండ్‌ పూర్తికావడానికి కనీసం 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే అదనపు సమయం పడుతుంది. తుది ఫలితం వెల్లడికి కనీసం 7 గంటల సమయం పడుతుంది.

కౌంటింగ్‌ ఎక్కడంటే..

కృష్ణా జిల్లా నియోజకవర్గాలు: మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ

ఎన్టీఆర్‌ జిల్లా నియోజకవర్గాలు: ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా కళాశాలలు

ఎన్టీఆర్‌ జిల్లాలో..

  • నందిగామ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును 14 టేబుళ్లపై 16 రౌండ్లలో పూర్తి చేయనున్నారు. ఇక్కడ 11 మందే పోటీలో ఉన్నారు. దీనివల్ల సీయూలో ఫలితం రావడానికి ఒక రౌండ్‌కు 15 నిమిషాలే పడుతుందని చెబుతున్నారు. ఈ ప్రకారం చూస్తే 4 గంటల్లోనే ఫలితం వస్తుంది.
  • జగ్గయ్యపేట కౌంటింగ్‌ కూడా 16 రౌండ్లకే పూర్తవుతుంది. కాకపోతే ఇక్కడ 14 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీనివల్ల ఫలితం వెల్లడికి మరో గంట అదనంగా పడుతుందని అంచనా.
  • మైలవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గాల కౌంటింగ్‌ 22 రౌండ్లలో పూర్తి చేయాల్సి ఉంది. ఫలితాల వెల్లడికి కనీసం పది గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. సెంట్రల్‌ నియోజకవర్గానికి కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.

కృష్ణా జిల్లాలో..

  • మచిలీపట్నం కౌంటింగ్‌ 15 రౌండ్లలో పూర్తవుతుంది. ఇక్కడ అభ్యర్థులు 14 మంది. ఒక్కొక్కరికి వచ్చిన ఓట్లను తెరపై చూపించేందుకు కొంత ఎక్కువ సమయం పడుతుంది. దీనికంటే ముందు పామర్రు ఫలితం రావొచ్చని చెబుతున్నారు. ఇక్కడ రౌండ్ల సంఖ్య 17. కానీ.. అభ్యర్థులు 8 మందే. దీనివల్ల రౌండ్లను త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంది.
  • గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల ఓట్లను 22 రౌండ్లలో లెక్కించనున్నారు. దీనివల్ల తుది ఫలితం వెల్లడికి కనీసం 10 నుంచి 11 గంటల సమయం పడుతుందని అంచనా.
  • గుడివాడ కౌంటింగ్‌ 17 రౌండ్లలో పూర్తవుతుంది. అవనిగడ్డ కొంత ఆలస్యమవుతుంది. ఇక్కడ 20 రౌండ్ల వరకు లెక్కింపు ఉంటుంది.
  • మచిలీపట్నం, విజయవాడ లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపునకూ దాదాపు ఇదే సమయం పట్టొచ్చు. రౌండ్లు కూడా ఇలానే ఉంటాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని