logo

యూకే పంపిస్తామని మోసం

యూకే పంపిస్తామని మోసానికి పాల్పడిన ఇద్దరిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. భవానీపురంలో పి.మర్రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నారు. ఆయన భార్య సునీతారెడ్డికి యూకే వీసా కోసం 2022లో ప్రయత్నించారు.

Published : 29 Feb 2024 05:49 IST

రూ.18 లక్షల వసూలు

భవానీపురం, న్యూస్‌టుడే : యూకే పంపిస్తామని మోసానికి పాల్పడిన ఇద్దరిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. భవానీపురంలో పి.మర్రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నారు. ఆయన భార్య సునీతారెడ్డికి యూకే వీసా కోసం 2022లో ప్రయత్నించారు. ఆ సమయంలో బందరు రోడ్డులోని ఓ కన్సల్టెన్సీలో పని చేసే వ్యక్తి ద్వారా భవానీపురంలో నివాసం ఉండే వడ్డాది లావణ్య పరిచయమైంది. లావణ్యను సంప్రదించగా యూకే పంపేందుకు రూ.16 లక్షలు ఖర్చవుతుందని చెప్పింది. ఆ ప్రకారం భవానీపురంలోని ఆమె ఇంటికి వెళ్లి రూ.1.35 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని ఐదు విడతల్లో రూ.14.65 లక్షలు ఇచ్చారు. రోజులు గడుస్తున్నా వీసా రాకపోవడంతో లావణ్యను సంప్రదించగా త్వరలోనే వస్తుందంటూ నమ్మబలికింది. ఈ లోపు ఆమె మరిది సాతూపాటి అరవింద్‌కుమార్‌ అలియాస్‌ సోను వారి వద్దకు వచ్చి యూకే విమాన ఖర్చులు, వసతి కోసం మరో రూ.2లక్షలు ఇవ్వాలని లావణ్య చెప్పినట్లు చెప్పగా ఆ మొత్తాన్ని కూడా ఇచ్చారు. రోజులు గడుస్తున్నా వీసా రాకపోవడంతో లావణ్య గురించి విచారణ చేయగా ఆమెపై పలు స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిసింది. ఆమెను సంప్రదించగా రూ.10 లక్షలకు చెక్కు ఇస్తానని, మిగిలిన మొత్తం మరిది సోనూ ద్వారా పంపుతానని చెప్పింది. ఈ నెల ఫిబ్రవరి 1న డబ్బుల గురించి సోనూను సంప్రదించగా ఇచ్చేది లేదని, దిక్కున్న చోట చెప్పుకోవాలని బెదిరించాడు. తనకు కేసులు కొత్తకాదని పేర్కొన్నాడు. దీనితో మర్రెడ్డి భవానీపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వడ్డాది లావణ్య, అరవింద్‌కుమార్‌ అలియాస్‌ సోనుపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా సోనుపై భవానీపురం పోలీసుస్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని