logo

అదనపు లడ్డూ కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు

శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులు లడ్డూ ప్రసాదం పొందేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. స్వామివారి దర్శనం తర్వాత ప్రసాదాన్ని పొందేందుకు ఆలయం వెనుక ఉన్న లడ్డూప్రసాద విక్రయ కేంద్రాలకు వెళతారు.

Published : 24 Jan 2023 01:50 IST

లడ్డూ విక్రయ కేంద్రంలో భక్తుల రద్దీ

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులు లడ్డూ ప్రసాదం పొందేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. స్వామివారి దర్శనం తర్వాత ప్రసాదాన్ని పొందేందుకు ఆలయం వెనుక ఉన్న లడ్డూప్రసాద విక్రయ కేంద్రాలకు వెళతారు. అక్కడ కింద, పైన దాదాపు 50 కౌంటర్లలో సర్వదర్శనం భక్తులు టోకెన్లు, ఎస్‌ఈడీ ఇతర దర్శనాలకు సంబంధించిన టికెట్లు చూపి లడ్డూలు పొందుతారు. కొందరు నగదు చెల్లించి తీసుకుంటుంటారు. భక్తుల సంఖ్య భారీగా పెరగడం, సిబ్బందికి సరైన వృత్తినైపుణ్యం లేకపోవడంతో తరచూ కౌంటర్ల వద్ద భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. వారాంతాల్లో సమస్య ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో భక్తులు సమస్యను పలుమార్లు తితిదే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డయల్‌ యువర్‌ ఈవోలో సైతం ఈవో ధర్మారెడ్డికి సమస్య వివరించారు. ప్రస్తుతం ఉన్న 50 లడ్డూ కౌంటర్లతోపాటు అదనంగా మరో 30 ఏర్పాటు చేసేందుకు ఇంజినీరింగ్‌ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
లడ్డూ విక్రయ కేంద్రంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నిర్వహిస్తున్న కేవీఎం సంస్థ.. సిబ్బందికి జీతభత్యాలు సరిగా ఇవ్వకపోవడంతో గతేడాది నవంబరులో ఆకస్మాత్తుగా విధులు బహిష్కరించారు. అప్పటికే క్యూలైన్‌లో లడ్డూలకోసం వేచి ఉన్న భక్తులు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న తితిదే ఉన్నతాధికారులు పరిస్థితిని చక్కదిద్దారు.  కేవీఎం సంస్థ కాంట్రాక్ట్‌ను తొలగించారు. అప్పటి వరకు సంస్థలో ఔట్‌సోర్సింగ్‌ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని తొలగించడంతో ఇబ్బందులు పునః ప్రారంభమయ్యాయి. వెంటనే తితిదే ఉద్యోగులు, శ్రీవారి సేవకులతో విక్రయాలు చేపట్టారు. అనంతరం కొంత సమయానికి కొత్తగా లడ్డూకౌంటర్లలో పనిచేసేందుకు సిబ్బందిని నియమించుకునేందుకు తితిదే ఔట్‌సోర్సింగ్‌ సంస్థ లక్ష్మీ శ్రీనివాస ద్వారా చర్యలు చేశారు.

గంటల తరబడి వేచి ఉండకుండా..

నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న వారు వేేగంగా లడ్డూలు అందించలేకపోతున్నారు. జారీలో తరచూ జాప్యం జరుగుతోంది. దీనికి నివారణలో భాగంగా అదనంగా 30 కౌంటర్లతోపాటు సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న కేంద్రాల పక్కనే ఖాళీ ప్రదేశంలో కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని