logo

కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్‌ను తలపిస్తున్న బెట్టింగ్‌లు

అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

Updated : 18 May 2024 07:59 IST

న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం: అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అమలాపురం కూటమి ఎంపీ అభ్యర్థికి లక్ష పైచిలుకు ఓట్ల మెజార్టీ వస్తుందంటున్నారు. పోటీ అభ్యర్థి జాడ గ్రామాల్లో కనిపించకపోవడంతో అధికార పార్టీ ఓట్లూ కూటమికే పడ్డాయంటున్నారు. రైలు కూత వినేందుకైనా ఈసారి కూటమికే ఓటేశామని అధికార పార్టీ కార్యకర్తలే చెబున్నారట కదా.. ఇదీ కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న చర్చ. కొత్తపేటలో అన్నదమ్ములిద్దరూ కలిసిపోయారని గెలుపు ఖాయమనిపిస్తోందని చెబుతున్నారు. ముమ్మిడివరంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థికి 10 వేలకుపైగానే మెజార్టీ వస్తోందంటున్నారు. పి.గన్నవరంలో మెజార్టీపైనే పందేలు వేసుకునే పరిస్థితి ఉందంటున్నారు. రాజోలులో ఓ పార్టీ అభ్యర్థి గెలుపు గురించి, సీనియర్‌ అయిన మరో అభ్యర్థి ప్రభావంపై చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన ఇక్కడే గెలవడంతో ఈ సారి పరిస్థితిపై లెక్కలు వేసుకుంటున్నారు. రామచంద్రపురంలో కాసింత గట్టిపోటీ ఉందనే అంటున్నారు. మండపేట కూటమిదేనని ఇటీవల కొన్ని పరిణామాలు ప్రత్యర్థిని వెనక్కి నెట్టేశాయని పేర్కొంటున్నారు. ః డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ యుగియడంతో అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా పందేలు సాగుతున్నాయి. ఓ పక్క ఐపీఎల్‌ బెట్టింగులు జరుగుతుంటే.. మరోపక్క ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశాలపై పందేలు కాస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు మరో 17 రోజుల గడువు ఉండటంపై ఎవరికి వారే అంచనాలు వేసుకుని పందేల్లో మునిగితేలుతున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్‌ సరళిని అంచనావేస్తూ పందేలు రూ.లక్షల్లో కాస్తున్నారు.

ఇక్కడే అధికం..

జిల్లాలోని అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేటలో ఎక్కువగా పందేలు జరుగుతున్నాయి. అమలాపురంలో కూటమి అభ్యర్థికి 10 వేల నుంచి 15 వేల వరకు మెజార్టీ వస్తుందని పందేలు సాగుతున్నాయి. ముమ్మిడివరంలో గెలుపు ఓటములపైకాకుండా అభ్యర్థుల మెజార్టీపై మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇక కొత్తపేటలో కూటమి అభ్యర్థి ఆధిక్యంపైనా పందేలు జరుగుతుండటంతోపాటు.. ప్రత్యర్థి గెలుస్తారంటూ ఆ వర్గం కూడా పందేలకు దిగుతోంది.

ఓటింగ్‌ శాతమే.. కీలకం

సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే ఓటింగ్‌ శాతం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో పెరిగిన ఓటింగ్‌ శాతమే ఇప్పుడు కూటమికి అనుకూలంగా మారిందని అంచనా వేస్తున్నారు. జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న పి.గన్నవరం, రాజోలు స్థానాల్లో మెజార్టీపై యువకులు అత్యధికంగా బెట్టింగ్‌ వేస్తున్నారు. మండపేట, రామచంద్రపురం స్థానాల్లోనూ గెలుపు ఓటములతోపాటు మెజార్టీపైనే చర్చ సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు