logo

దేవదాయశాఖ భూమి అన్యాక్రాంతం

గోరంట్లలోని సీతారాములస్వామి గుడికి సంబంధించిన భూమి అన్యాక్రాంతమైంది.

Updated : 30 Nov 2022 05:59 IST

నల్లపాడు పోలీసులకుఫిర్యాదు చేసిన గ్రామస్థులు
అధికారుల ఎదుటే ఆక్రమణదారుల హల్‌చల్‌

గుంటూరు రూరల్‌, న్యూస్‌టుడే: గోరంట్లలోని సీతారాములస్వామి గుడికి సంబంధించిన భూమి అన్యాక్రాంతమైంది. గుంటూరు రూరల్‌ మండల పరిధిలోని గోరంట్లలో దేవాదాయ శాఖకు చెందిన రూ.30 కోట్ల విలువైన భూమిని అదే ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఆక్రమించారు. సర్వే నెంబర్‌ 53-1లో 93.5 సెంట్లు భూమికి ఆక్రమణదారులు తప్పుడు నెంబర్‌ వేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. 800 గజాలు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. గ్రామస్థులు సోమవారం స్పందనలో ఫిర్యాదు చేయడంతో దేవదాయ శాఖ అధికారులు మంగళవారం గోరంట్లలో విచారణకు వెళ్లారు. భూమిని పరిశీలిస్తుండగా ఆక్రమించిన వ్యక్తులు అక్కడకు వచ్చి వీరంగం సృష్టించారు. దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ మహేశ్వరరెడ్డి ఎదుట ఆక్రమణదారులు రెచ్చిపోయారు.  ఫిర్యాదు చేసిన వారిపై దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. అధికారుల ఎదుటే ఫిర్యాదు చేసిన వారిని చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో గ్రామస్థులు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై స్టేషన్‌ సీఐ బత్తుల శ్రీనివాసరావును వివరణ కోరగా తమకు ఫిర్యాదు అందలేదన్నారు. ఈ ఘటన  సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఫిర్యాదు వస్తే విచారించి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని