logo

2 రూ.కోట్లుక్యాసినో ఆడేశాడు!

సుమారు రూ.2 కోట్లు.. 70 మంది రైతుల కష్టం.. ఓ వ్యాపారికి జూదం సరదా.. వెరసి మొత్తం నగదు అంతర్జాలంలో క్యాసినో ఆడి పోగొట్టేశాడు.. రైతులకు తిరిగి డబ్బు ఇవ్వలేక ఏడాది

Published : 30 Mar 2023 05:28 IST

రైతుల కష్టంతో వ్యాపారి జూదం

బల్లికురవ, న్యూస్‌టుడే: సుమారు రూ.2 కోట్లు.. 70 మంది రైతుల కష్టం.. ఓ వ్యాపారికి జూదం సరదా.. వెరసి మొత్తం నగదు అంతర్జాలంలో క్యాసినో ఆడి పోగొట్టేశాడు.. రైతులకు తిరిగి డబ్బు ఇవ్వలేక ఏడాది క్రితం గ్రామం వదిలేసి వెళ్లిపోయాడు. రెండు రోజుల క్రితం పోలీసులకు చిక్కగా విషయం బయటపడింది. మండలంలోని కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన ప్రదీప్‌ కొంతకాలంగా గ్రామంలో మొక్కజొన్నలు, ధాన్యం ఇతర పంటలను రైతుల నుంచి కొనుగోలు చేసి కాకినాడకు చెందిన వ్యాపారికి ఎగుమతి చేస్తుండేవాడు. ఇదే తరహాలో గత ఏడాది ఆ గ్రామానికి చెందిన రైతుల నుంచి పంటలను కొన్నాడు. తొలుత కర్షకులకు క్రమం తప్పకుండా నగదు ఇవ్వడంతో అందరూ నమ్మి ఎక్కువ మొత్తంలో అతనికే పండించిన పంటను అమ్మేశారు. కొన్ని రోజులు గడిచిన తరువాత నగదు కోసం రైతులు వ్యాపారిపై ఒత్తిడి చేశారు. మిల్లరు నగదు ఇవ్వలేదంటూ సమాధానం చెప్పుకొంటూ వచ్చేడు. చివరకు కర్షకులు నేరుగా మిల్లర్లను సంప్రదిస్తే విడదల వారీగా నగదును ఆ వ్యాపారి సూచించిన ఖాతాలో జమ చేశామని చెప్పారు. ఆందోళన చెందిన రైతులు ప్రదీప్‌ ఇంటికి చేరుకున్నారు. వారి రాకను పసిగట్టిన వ్యాపారి గత ఏడాది ఆగస్టులో గ్రామం విడిచి వెళ్లిపోయాడు. పోలీసులకు అతని ఆచూకీ మంగళవారం తెలియడంతో స్టేషన్‌కు తరలించారు.

నా దగ్గర చిల్లిగవ్వలేదు..

వ్యాపారి.. పోలీసుల అదుపులో ఉన్నాడన్న సమాచారం తెలుసుకున్న రైతులు బుధవారం పెద్ద ఎత్తున బల్లికురవ స్టేషన్‌కు చేరుకుని అతడిని విచారించారు. నా దగ్గర చిల్లిగవ్వ లేదు.. ఉన్న నగదు అంతా ఆన్‌లైన్‌ల్లో క్యాసినో ఆడాను.. వస్తాయని ఆశతో ముందు కొంచెం పెట్టుబడి పెట్టాను.. తిరిగి రాకపోవడంతో మరికొంత వెచ్చించాను. అలా విడతల వారీగా క్యాసినో ఆడటంతో మొత్తం పోయాయని బదులిచ్చాడు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన రైతులు మా నగదుతో నీకు జూదం ఎలా ఆడాలనిపించిందంటూ వాపోయారు. పోలీసులు మాత్రం అతని బ్యాంకు ఖాతాల వివరాలు, లావాదేవీలు జరిగిన తీరు తెలుసుకునేందుకు ఆయా బ్యాంకు మేనేజర్లకు లేఖ రాశారు. ఏది ఏమైనప్పటికీ ఓ వ్యాపారి జూదానికి బానిసై సుమారు 70మంది రైతులు మరో పది మంది దాచుకునేందుకు ఇచ్చిన నగదు పూర్తిగా ఆన్‌లైన్‌లో పోగొట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిలో కొందరు రూ.2, 3, 4, 5లక్షల వరకు ఇచ్చినవారు ఉన్నారు. చాలా మంది పిల్లల చదువుల కోసం, మరి కొందరు పెళ్లిళ్లు చేయడం కోసం దాచుకున్నామని బోరున విలపిస్తున్నారు. సాగుకు అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులు ఎలా తీర్చాలని ఇంకొందరు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు