ఉపాధ్యాయులపై ఎందుకింత ఒత్తిడి?
ఉపాధ్యాయులపై మరింతగా ఒత్తిడి తెస్తున్నారు. పిల్లలతో కలిసి ఎంతో హుందాగా ఉద్యోగం చేసే రోజుల్ని అయ్యవార్లు రెండేళ్ల క్రితమే కోల్పోయారు.
విద్యాసంవత్సరం ఆఖరి రోజుల్లోనూ అల్టిమేటం
మార్కుల వివరాలు నమోదు చేస్తున్నా ఆన్లైన్లో కన్పించని వైనం
మంగళగిరి, తాడేపల్లి, న్యూస్టుడే: ఉపాధ్యాయులపై మరింతగా ఒత్తిడి తెస్తున్నారు. పిల్లలతో కలిసి ఎంతో హుందాగా ఉద్యోగం చేసే రోజుల్ని అయ్యవార్లు రెండేళ్ల క్రితమే కోల్పోయారు. విద్యా సంవత్సరం ముగియడానికి మరో రెండు రోజులు గడువున్నా సరే విద్యార్థుల మార్కులు ఆదివారం సాయంత్రానికల్లా అప్లోడ్ చేస్తారా? లేదా? అంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఆదివారం సెలవు రోజున విద్యార్థుల వివరాలు ఇంటి వద్ద ఎలా ఉంటాయనే ఆలోచన కూడా లేకుండా పూర్తిచేయకుంటే డీఈవో ముందు హాజరుకావాలని ఒక మెసేజ్, కమిషనర్ ఎదుట హాజరుకావాలంటూ వాట్సాప్ ద్వారా మరో సందేశం అందుతుండడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 18వ తేదీ వరకూ హైస్కూళ్లలో పరీక్షలు జరిగాయి. ఆ జవాబు పత్రాల్ని ఉపాధ్యాయులు సక్రమంగా దిద్దడానికి కనీసం మూడు, నాలుగు రోజులు పడుతుంది. ఆ సంగతి ఉన్నతాధికారులందరికీ తెలుసు. కానీ ఆదివారం సాయంత్రం కల్లా వివరాలన్నింటినీ నమోదు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాక ప్రతి విద్యార్థికి సంబంధించి సబ్జెక్టు మార్కులతో పాటు సంపూర్ణమైన ప్రగతి(హోలిస్టిక్ ప్రోగ్రెస్) పేరుతో నాలుగు అంశాల్లో విద్యార్థులకు మార్కులు వేయాలి. మొతం 21 అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కులు నమోదు చేయాలి. ఇందుకు గంటల సమయం పడుతోంది. అన్నీ చేసి ఆన్లైన్ ప్రగతి నివేదిక (రిపోర్టు కార్డు)లో నమోదు చేస్తే వివరాలు కన్పించడం లేదు. దీంతో మళ్లీ మొదటికి రావాల్సి వస్తోందని, ఈ తరహా ఒత్తిడి ఎప్పుడూ లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.