logo

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి పూర్వ వైభవం : బ్రాహ్మణి

ఏ రంగంలోనైనా విజయం సాధించగల సత్తా మహిళలకే ఉందని నారా బ్రాహ్మణి అన్నారు.

Updated : 22 Apr 2024 06:32 IST

స్త్రీశక్తి లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతున్న నారా బ్రాహ్మణి

మంగళగిరి, న్యూస్‌టుడే: ఏ రంగంలోనైనా విజయం సాధించగల సత్తా మహిళలకే ఉందని నారా బ్రాహ్మణి అన్నారు. భర్త నారా లోకేశ్‌ తరఫున ఆమె గత రెండు రోజులుగా మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక వీటీజేఎం అండ్‌ ఐవీటీఆర్‌ డిగ్రీ కళాశాల ఆవరణలోని సమావేశ మందిరంలో ‘స్త్రీశక్తి’ పథకం లబ్ధిదారులతోపాటు మహిళా మిత్ర, డ్వాక్రా బృంద సభ్యులతో ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు. చంద్రబాబుపై నమ్మకంతో అమరావతి రైతులు భూములిస్తే.. ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలన్నింటినీ తీరుస్తారని భరోసా ఇచ్చారు. గత ఎన్నికల్లో లోకేశ్‌ విజయం సాధించకపోయినా ఇక్కడి వారిని కుటుంబ సభ్యులుగా భావించి సేవ చేస్తున్నారని బ్రాహ్మణి అన్నారు. పేదలకు తోపుడుబళ్లు, పెళ్లికానుకలు, ఆరోగ్య సంజీవని, వీవర్స్‌శాల తదితర కార్యక్రమాలు సొంత నిధులతో అమలు చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ‘స్త్రీశక్తి’ పథకాన్ని మరింత విస్తృతం చేస్తామని, ఇప్పటికే రెండు వేల మందికి ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చి మిషన్లు అందజేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని