logo

Hyderabad Metro: త్వరలో హైదరాబాద్‌ మెట్రో ఛార్జీల పెంపు

మెట్రో ఛార్జీలపై ‘ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ’ అధ్యయనం చేస్తోంది. ఆ నివేదిక ఆధారంగా త్వరలో ఛార్జీల పెంపు ఉండనుందని తెలుస్తోంది.

Updated : 25 Jan 2023 10:32 IST

సాఫ్ట్‌ లోన్‌.. ఈక్విటీ పెట్టుబడులకు ఎదురుచూపు

మెట్రో ఛార్జీలపై ‘ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ’ అధ్యయనం చేస్తోంది. ఆ నివేదిక ఆధారంగా త్వరలో ఛార్జీల పెంపు ఉండనుందని తెలుస్తోంది. మరోవైపు ఆర్థికంగా ప్రాజెక్ట్‌ పునర్నిర్మాణామంపై ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో సంస్థ దృష్టి పెట్టింది. ఆదాయం పెంచుకోవడంతోపాటు ప్రాజెక్ట్‌ను లాభదాయకంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.

వడ్డీ భారం తగ్గిందిలా..

మెట్రో నిర్మాణ ఖర్చు మొత్తం రూ.13 వేల కోట్లు ఎల్‌ అండ్‌ టీ సంస్థనే భరించింది. బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణం తీసుకుంది.  లాక్‌డౌన్‌తో నష్టాల్లోకి కూరుకుపోయింది. రుణాలకు వడ్డీ చెల్లించలేని పరిస్థితి ఏర్పడటంతో కమర్షియల్‌ లోన్లను ఎల్‌ అండ్‌ టీ గ్యారంటీ బాండ్లుగా మార్చి వడ్డీని 9 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించుకుంది. మరోవైపు రూ.3 వేల కోట్ల సాఫ్ట్‌ లోన్‌ ఇచ్చి ఆదుకోవాలని ఆ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై సర్కారు సానుకూల స్పందించిందని మెట్రో వర్గాలు తెలిపాయి.

భూములు లీజుకు..

మెట్రో కోసం ప్రభుత్వం వేర్వేరు ప్రాంతాల్లో భూములను 65 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ఇక్కడ  రవాణా ఆధారిత అభివృద్ధి (టీవోడి) చేపట్టి ఆదాయం సమకూర్చుకోవాలనేది ఒప్పందం. అభివృద్ధికి నిధులు లేక ఆ భూములను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది.  ఇప్పటికే రాయదుర్గంలోని 15 ఎకరాలను లీజుకిచ్చారు.

రూ.8 వేల కోట్లకు తగ్గుతుంది

ప్రభుత్వం ఇచ్చే సాఫ్ట్‌లోన్‌, భూముల దీర్ఘకాల లీజు ద్వారా రూ.5 వేల కోట్లు వస్తే రుణ భారం రూ.8 వేల కోట్లకు తగ్గుతుందని ఎల్‌ అండ్‌ టీ పూర్తికాల డైరెక్టర్‌, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కిషోర్‌సెన్‌ వెల్లడించారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరో రూ.2-3 వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులకు చూస్తున్నామని తెలిపారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని