logo

మన్నిక మూణ్ణాళ్ల ముచ్చటేనా!

సిమెంటు దారులు, మురుగు కాల్వల నిర్మాణానికి నాణ్యమైన ఇసుకను వాడేందుకు గుత్తేదారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపడంలేదు. రాతిపొడి (డస్ట్‌), కాల్వల్లో మట్టికలిసిన నాణ్యత లేని ఇసుక రెండూ కలిపి వాడేందుకు సిద్ధం అవుతున్నారు.

Published : 01 Feb 2023 01:15 IST

సిమెంటు దారులకు నాణ్యతలేని రాతిపొడి, మట్టి ఇసుక

డంప్‌ చేసుకున్న మట్టి ఇసుక

న్యూస్‌టుడే, పాత తాండూరు: సిమెంటు దారులు, మురుగు కాల్వల నిర్మాణానికి నాణ్యమైన ఇసుకను వాడేందుకు గుత్తేదారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపడంలేదు. రాతిపొడి (డస్ట్‌), కాల్వల్లో మట్టికలిసిన నాణ్యత లేని ఇసుక రెండూ కలిపి వాడేందుకు సిద్ధం అవుతున్నారు. రెవెన్యూ అధికారులు ఇసుక అనుమతులిస్తామని చెబుతున్నా.. సదరు గుత్తేదారులు తీసుకునేందుకు ముందుకు రావడంలేదని విమర్శలొస్తున్నాయి.  

కేంద్రం నుంచి రూ.32.89 కోట్లు విడుదల

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో సిమెంటు దారులు, మురుగు కాల్వల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.32.89 కోట్లు విడుదల చేసింది. ఈ పనులను మార్చి 25వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు నిధులు మంజూరైన గ్రామాల్లో పనులు చేసేందుకు గ్రామస్థాయి నాయకులు, గుత్తేదారులు సిద్ధం అవుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే నాణ్యమైన ఇసుకకు బదులు పొలాల్లో పేరుకున్న దుబ్బ ఇసుక, వరద కాల్వల్లో నిలిచిన మట్టి కలిసిన ఇసుకను ట్రాక్టర్లలో డంప్‌ చేసుకొని పెట్టుకుంటున్నారు.

ట్రాక్టరు ఇసుక రూ.1,800లకే..

ప్రభుత్వ పనులకు ఇసుకను ఉపయోగించుకునే విధంగా ఇసుక పాలసీని అధికారులు సిద్ధం చేశారు. రెవెన్యూ, మైన్స్‌, పోలీసుశాఖ ఆధ్వర్యంలో బషీరాబాద్‌లోని నవాంద్గీ, గంగ్వార్‌, పాత తాండూరులో చెక్‌డ్యామ్‌ సమీపంలో, ఆయా మండలాల్లో అనువైన వాగుల్లో ఇసుక అనుమతులు తీసుకోవచ్చని ఇసుక దిబ్బలను గుర్తించారు. నవాంద్గీలో ట్రాక్టరు (3క్యూబిక్‌ మీటర్లు) ఇసుక రూ.1,200 కాగా, పాత తాండూరులో ట్రాక్టరు ఇసుక రూ.1,800గా ఉంది. రూ.800 కూలీ, మిగతా డబ్బులు మైన్స్‌, రెవెన్యూకంటూ నిర్ణయించారు. 

పొడి కలిసిన రాతి ఇసుక 

అనుమతులిలా...

మంజూరైన సిమెంటు రోడ్డు ప్రొసీడింగ్స్‌ను పంచాయతీరాజ్‌ ఏఈ, డీఈఈలకు అందజేస్తే మంజూరైన నిధుల ప్రకారం.. ఎంత క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరం అవుతుందో అధికారులు తేలుస్తారు. సంబంధిత రెవెన్యూ అధికారులకు పంచాయతీరాజ్‌ డీఈఈ ఇసుక ఇవ్వాలని సిఫార్సు చేస్తారు. ఈమేరకు తహసీల్దార్‌ పేరిట బ్యాంకులో డీడీ తీసి అందజేస్తే వెంటనే ఇసుక అనుమతులు అందజేయనున్నామని ఆయా మండలాల తహసీల్దార్లు తెలియజేస్తున్నారు.


పనులు నాణ్యతగా ఉండాలి
శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ జిల్లా అధికారి

సిమెంటు దారుల నిర్మాణాలు నాణ్యతగా చేయాలి. స్థానికంగా ఇసుక లభ్యమైతే రెవెన్యూ అనుమతులు తీసుకొని పనులు చేయాలి. అవసరమైన ఇసుక సిఫార్సు పత్రాలను మా నుంచి రెవెన్యూ వారికి ఇస్తాం. రోబోశాండ్‌ వాడొచ్చు పొడి కలవకుండా నాణ్యతగా ఉండాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని