logo

పాడి వృద్ధిపై ఏదీ దృష్టి

రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందుకు రైతులు ఎంతో సంతోషించారు. ఇదే సమయంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి చర్యలు, ప్రోత్సాహకాలను ప్రకటించకపోవడంతో సంబంధిత రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

Published : 09 Feb 2023 01:57 IST

ప్రభుత్వ చేయూతకు రైతుల ఎదురు చూపులు
న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌  

పాల శీతలీకరణ కేంద్రం

రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందుకు రైతులు ఎంతో సంతోషించారు. ఇదే సమయంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి చర్యలు, ప్రోత్సాహకాలను ప్రకటించకపోవడంతో సంబంధిత రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇటీవలి కాలంలో పాల ధరలకు మంచి డిమాండ్‌ ఉంటోంది. పల్లెల్లో లీటరు పాలు రూ.70కి పైగానే విక్రయిస్తున్నారు. పాల ఉత్పత్తులకు కూడా గిరాకీ పెరుగుతోంది. రైతులు కూడా పాల దిగుబడి వైపు దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ప్రత్యామ్నాయం దిశగా అడుగులు

రానురాను వ్యవసాయం భారంగా మారుతున్న తరుణంలో అధికారులు ప్రత్యామ్నాయంవైపు అడుగులు వేయాలని ప్రోత్సహిస్తున్నారు. దీనికి అనుగుణంగా రైతులు పాల దిగుబడికి కృషి చేస్తున్నారు. జిల్లా అచ్చంగా వ్యవసాయాధారిత ప్రాంతం కావడంతో పాడితో విడదీయలేని అనుబంధం ఉంది.  

నార్మాక్స్‌ పరిధిలో పరిగి, తాండూరులో పాలకేంద్రాలు పనిచేస్తుండగా ప్రైవేట్‌ డెయిరీలు వందల కొద్దీ ఉన్నాయి. వీటికి లక్ష లీటర్లకు పైగా పాలు సరఫరా అవుతున్నాయి

దడ పుట్టిస్తున్న దాణా ధరలు

దాణా ధరలు విపరీతంగా పెరగడంతో వాటి పోషణ పేదలకు తలకుమించిన భారంగా మారింది. ప్రభుత్వ డెయిరీల ద్వారా విరివిగా రాయితీలు కల్పిస్తేనే మేలు కలుగుతుందన్న అభిప్రాయం ఉత్పత్తిదారుల నుంచి వ్యక్తమవుతోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం లీటరుకు రూ.4చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఆ బకాయిలు నేటికీ ఇవ్వలేదు.  

పశు సంవర్థక శాఖలో అరకొరే..

పాడి పరిశ్రమ బలోపేతం కావాలంటే పశు సంవర్థక శాఖలో తగినంత మంది సిబ్బంది ఉండాలి. జిల్లాలో తగినంతమంది లేక పశువైద్య సమస్యలొస్తే రైతులకు అవస్థలు తప్పడంలేదు.


రాయితీలు ఇచ్చి ఆదుకోవాలి

శంకర్‌నాయక్‌, ఉత్పత్తిదారుడు

పాలకు మంచి డిమాండ్‌ లభిస్తున్నా పోషణ భారంగా మారుతోంది.  సబ్సిడీపై పాడిపశువులను అందించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. గడ్డి కత్తిరింపు యంత్రాలు, మేలు రకం గడ్డి విత్తనాలను 90శాతం రాయితీపై సరఫరా చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని