logo

కట్టడిలేదు.. కట్టాల్సిందే

కొత్త విద్యా సంవత్సరం కొద్దిరోజుల్లో మొదలుకానుంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చూసి బెంబేలెత్తుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు బాదుడు ప్రారంభించాయి.

Published : 27 May 2023 01:47 IST

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజుల బాదుడు
10-20 శాతం మేర పెంచిన యాజమాన్యాలు
ఈనాడు, హైదరాబాద్‌

కొత్త విద్యా సంవత్సరం కొద్దిరోజుల్లో మొదలుకానుంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చూసి బెంబేలెత్తుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు బాదుడు ప్రారంభించాయి. గతేడాది కంటే 10 నుంచి 20 శాతం అదనంగా పెంచేశారు. ముంబయి, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ఫీజులు పెంచుతున్నామంటూ యాజమాన్యాలు ప్రకటించగా.. దిల్లీలో మాత్రం హైకోర్టు ఆదేశాల మేరకు పాఠశాలలు నడుచుకోనున్నాయి.

ఫీజులు పెంచేందుకు విద్యాశాఖ అనుమతి తప్పనిసరి అంటూ దిల్లీ హైకోర్టు రెండు నెలల కిందట మార్గదర్శకాలు జారీ చేసింది. పాఠశాలల అభివృద్ధి కోసం రుసుములు పెంచుకోవచ్చని వాటికి సంబంధించిన నివేదికను ఆన్‌లైన్‌ ద్వారా విద్యాశాఖకు సమర్పించాలని పేర్కొంది. అధికారుల ఆమోదముద్ర అనంతరం నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో మాత్రం నిర్వహణ ఖర్చులు పెరిగాయంటూ యాజమాన్యాలు రుసుములు బాదుతున్నాయి.

ఉత్తర్వులు చిత్తు కాగితాలేనా..?

ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఏటా ఫీజులు పెంచకూడదంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చట్టం రూపొందించింది. దీని ప్రకారం ఫీజుల రూపంలో ఎంత ఆదాయం వచ్చినా పాఠశాలల అభివృద్ధికే ఖర్చు చేయాలి. వచ్చిన లాభాల్లో 5 శాతం మాత్రమే తీసుకోవాలి. ఇందుకు భిన్నంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ప్రైవేటు పాఠశాలలు ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయి. ఏ కారణంతో పెంచారో యాజమాన్యాలు తెలపడం లేదని హైదరాబాద్‌ స్కూల్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి వెంకటసాయినాథ్‌ తెలిపారు. బాదుడుపై పలు రుపాల్లో నిరసనలు వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

దొందూ దొందే...

ఫీజుల పెంపుపై ప్రైవేటు, కార్పొరేట్‌ యాజమాన్యాలు దొందూ దొందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. కాలనీల్లోని అపార్ట్‌మెంట్లలో నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు, సొంత భవనాల్లోని కార్పొరేట్‌ పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరానికి అప్పుడే ఫీజులు పెంచేశాయి. గల్లీలు, కాలనీల్లోని ప్రైవేటు పాఠశాలలు 10 నుంచి 15 శాతం వరకు పెంచితే, కార్పొరేట్‌ సంస్థలు 15 శాతం నుంచి 20 శాతం అదనంగా భారం మోపుతున్నాయి. కొన్ని పాఠశాలల ప్రతినిధులు మే ఫీజును జూన్‌లో చెల్లించాలంటూ మౌఖికంగా విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు.

ఆబిడ్స్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, కోఠి ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలలు ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ 15 శాతం ఫీజును, ఆరు నుంచి పదో తరగతి వరకూ 20శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ పాఠశాలలు, పేరున్న ప్రైవేటు పాఠశాలలు ఏకంగా 20 శాతం ఫీజు పెంచాయి. ఆయా పాఠశాలల్లో ఎల్‌కేజీకి రూ.లక్ష నుంచి రూ.1.20 వేలకు పెంచాయి. ఈ ఫీజుకు అదనంగా రూ.లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని