logo

బ్రెయిన్‌డెడ్‌ అని చెప్పక రూ.లక్షలు కాజేశారు

కేపీహెచ్‌బీ నాలుగో రోడ్డులోని ఓ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందిన యువకుడు వైద్యుల నిర్లక్ష్యంతోనే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.

Published : 23 May 2024 08:36 IST

ఆసుపత్రి ఎదుట బంధువులు, గ్రామస్థుల ఆందోళన 

 డి.విజయ్‌కుమార్‌ 
హైదరాబాద్,న్యూస్‌టుడే: కేపీహెచ్‌బీ నాలుగో రోడ్డులోని ఓ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందిన యువకుడు వైద్యుల నిర్లక్ష్యంతోనే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. స్థానిక పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం..పరిగి పరిధి సుల్తాన్‌పూర్‌కు చెందిన మల్లయ్య పెద్ద కుమారుడు డి.విజయ్‌కుమార్‌(23) డిగ్రీ చదువుతున్నాడు. ఇతనికి తలలో సమస్య ఉందని స్థానిక వైద్యుడు చెప్పడంతో ఏప్రిల్‌ 2న కేపీహెచ్‌బీ నాలుగో రోడ్డులోని న్యూరో ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి యాజమాన్యం తొలుత రూ.2.5లక్షల ప్యాకేజీ అని చెప్పి శస్త్రచికిత్స చేశారు. తర్వాత మరో రెండు శస్త్రచికిత్సలు చేశారు. కుటుంబసభ్యులు అడిగినప్పుడల్లా మెల్లగా కోలుకుంటాడని వైద్యులు చెప్పారు. చాలారోజులు కావడంతో సందేహం వచ్చి మే 20న బంజారాహిల్స్‌లోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్‌డెడ్‌ అయినట్లుగా వైద్యులు చెప్పడంతో బోరున విలపించారు. ఎలాగైనా కాపాడాలని, మీ ప్రయత్నం మీరు చేయండి అంటూ కుటుంబసభ్యులు వేడుకోవడంతో విజయ్‌కుమార్‌ను వెంటిలేటర్‌పై ఉంచారు. మంగళవారం విజయ్‌కుమార్‌ బంధువులు, గ్రామస్థులు కేపీహెచ్‌బీలోని న్యూరో ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఎస్సై శ్రీనివాసులు చేరుకుని సముదాయించడంతో ఆందోళన ఉపక్రమించారు. ఆసుపత్రి యజమానిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా విజయ్‌కుమార్‌ వచ్చిన సమయంలో స్పృహ లేదని, సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. తలకు మూడుసార్లు శస్త్రచికిత్స చేశామని, మిగతా అవయవాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతోనే ఇన్ని రోజులు ఉంచుకున్నామని పేర్కొన్నారు.


కొడుకును కాపాడేందుకు గేదెలు, ఇంటి స్థలం అమ్మేశా: మల్లయ్య

మంచిగ ఉన్న నా కొడుకు వైద్యుల నిర్లక్ష్యంతో వెంటిలేటర్‌పై ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని బాధపడ్డాడు. నా కొడుకు ప్రాణం కోసం పాలిచ్చే 12 గేదెలు, ఇంటి స్థలం, అప్పు తీసుకొచ్చి రూ.25లక్షలు ఆసుపత్రికి చెల్లించానని కన్నీరుమున్నీరుగా విలపించాడు. నా కొడుకును చూసేందుకు వీల్లేకపోవడంతో రోజువారి పరిస్థితి చెప్పేందుకు రోజుకు రూ.1500 తీసుకున్నారని వాపోయాడు. వయసొచ్చిన కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ప్రాణం పోయినట్లు అనిపిస్తుందని విచారం వ్యక్తం చేశాడు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని