logo

Hyderabad: నిత్య పెళ్లికొడుకుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. మూడో పెళ్లి చేసుకొని..

నిత్య పెళ్లి కొడుకుగా మారిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గుట్టుచప్పుడు కాకుండా ముచ్చటగా మూడోసారి తనను పెళ్లి చేసుకొని వారం రోజులు కలిసున్నాక..

Updated : 30 Jan 2023 08:10 IST

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: నిత్య పెళ్లి కొడుకుగా మారిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గుట్టుచప్పుడు కాకుండా ముచ్చటగా మూడోసారి తనను పెళ్లి చేసుకొని వారం రోజులు కలిసున్నాక.. మొహం చాటేస్తున్నాడని ఓ వైద్యురాలు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీఐ శ్రీనివాస్‌, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కంటోన్మెంట్‌లోని దిల్‌ఖుష్‌నగర్‌కు చెందిన వంశీకృష్ణ(39) హైటెక్‌ సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న వంశీకృష్ణ ఇద్దరికీ విడాకులిచ్చి, మూడో వివాహం చేసుకునేందుకు ఓ మ్యాట్రిమోనీలో దరఖాస్తు చేసుకున్నాడు.

ఈ క్రమంలో నెల్లూరుకు చెందిన ఓ వైద్యురాలు తన భర్త చనిపోవడంతో కుటుంబ సభ్యుల అనుమతితో అదే మ్యాట్రిమోనీలో వరుడికోసం దరఖాస్తు చేసుకుంది. అలా వంశీకృష్ణకు ఆమెతో పరిచయమైంది. కొద్దిరోజులక్రితం నెల్లూరు వెళ్లి ఆమెను కలిశాడు. అక్కడే ఉన్న అతడు మాయమాటలతో నమ్మించాడు. వివాహం చేసుకుంటానని చెప్పి ఈనెల 4న ఆమెను తన ఇంటికి పిలిచాడు. ఇప్పటికే వివాహాలు జరిగిన తాము ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకుందామని చెప్పి తాళి కట్టాడు. వారంపాటు ఇక్కడే ఉండిపోయిన వారు శారీరకంగా ఒక్కటయ్యారు. అనంతరం నెల్లూరుకు వెళ్లిన ఆమె ఈనెల 24న తిరిగి నిందితుడి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో అతను మొహం చాటేసేందుకు యత్నించాడు.  దీంతో తాను మోసపోయినట్లు భావించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పడంతో ఆమెను రెండు రోజులపాటు గదిలో నిర్బంధించాడు.

ఇదిలా ఉండగానే మరో మహిళను వివాహం చేసుకోవడానికి మరోసారి మ్యాట్రిమోనీలో నిందితుడు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తును పరిశీలించిన మ్యాట్రిమోని ప్రతినిధులు అనుమానం వచ్చి బాధితురాలికి ఫోన్‌ చేయడంతో ఆమె జరిగిన విషయాన్ని చెప్పింది. ఎలాగోలా అతడి ఇంటి నుంచి బయటికొచ్చిన బాధితురాలు, మ్యాట్రిమోని ప్రతినిధులతో కలిసి ఆదివారం ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఇందులో నిందితుడి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని