logo

తండ్రీకొడుకుల ఘరానా మోసం

కుమారుడిని పావుగా వాడుకొని తండ్రి తప్పటడుగు వేశాడు. రూ.డబ్బుపై ఆశతో ఘరానా మోసానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో తండ్రీకొడుకు జైలు పాలయ్యారు.

Published : 08 Feb 2023 02:40 IST

విదేశాల్లో తెలుగు విద్యార్థులకు టోకరా
రూ.2.06 కోట్ల వసూళ్లు

వివరాలు వెల్లడిస్తున్న సీసీఎస్‌ జాయింట్‌ సీపీ గజరావు భూపాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: కుమారుడిని పావుగా వాడుకొని తండ్రి తప్పటడుగు వేశాడు. రూ.డబ్బుపై ఆశతో ఘరానా మోసానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో తండ్రీకొడుకు జైలు పాలయ్యారు. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులను మోసగించిన ముగ్గురిని నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం బషీర్‌బాగ్‌ నగర పోలీసు కమిషనరేట్‌లో డీసీపీ స్నేహమెహ్రా, ఏసీపీ కేవీఎం ప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ కె.హరిభూషణరావుతో కలిసి సీసీఎస్‌ జాయింట్‌ సీపీ డాక్టర్‌ గజరావు భూపాల్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.

మలక్‌పేట నివాసి దేవరశెట్టి పెద్ద వెంకటేశ్వర్లు(58) వ్యాపారి. ఇతడి కుమారుడు డి.గౌతమ్‌(22) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. తండ్రి సూచనతో కెనడా, అమెరికా దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు వచ్చిన తెలుగు విద్యార్థుల ఫోన్‌ నంబర్లు సేకరించాడు. వీరందరితో వాట్సాప్‌ గ్రూప్‌లు తయారు చేశాడు. వారి చదువు, కుటుంబ వివరాలు రాబట్టి ..  నగరంలోని తండ్రికి చేరవేస్తుండే వాడు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌ చేస్తూ ఆయన కొత్త తరహా మోసాలకు తెరతీశాడు.

క్రెడిట్‌కార్డుతో చెల్లిస్తే రాయితీ: తన కుమారుడు కెనడాలో చదువుతున్నాడని, అతడికి అక్కడున్న క్రెడిట్‌కార్డు ద్వారా విద్యాసంస్థల్లో సెమిస్టర్‌ ఫీజులు చెల్లిస్తే 10 శాతం రాయితీ వస్తుందంటూ నమ్మించేవాడు. అది నమ్మి నగదు వెంకటేశ్వర్లు బ్యాంకు ఖాతాలో జమచేసే వారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 32 మంది విద్యార్థుల నుంచి రూ.2.06కోట్లు వసూలు చేశారు. నారాయణగూడ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి అమెరికాలో చదువుతున్న కుమారుడి సెమిస్టర్‌ ఫీజు రూ.6.69 లక్షలు పెద్దవెంకటేశ్వర్లు ఖాతాలో జమచేశాడు. గతేడాది నవంబరులో ఒకే క్రెడిట్‌కార్డు నుంచి 27 మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించినట్లు ఫిర్యాదులు రావటంతో, ఆ విశ్వవిద్యాలయం వ్యాపారి కుమారుడి ఫీజును వెనక్కి ఇచ్చింది.  బాధితుడి ఫిర్యాదుతో గత నెల 6న కేసు నమోదు చేశారు.

దుబాయ్‌ వయా గోవా: వెంకటేశ్వర్లు విద్యార్థుల నుంచి సేకరించిన నగదులో 35శాతం కమీషన్‌ మినహాయించుకొని.. మిగతాది గోవాలోని కోహీర్కర్‌ నితేష్‌(38) బ్యాంకు ఖాతాలో జమచేస్తాడు. అతడు 5శాతం కమీషన్‌ తీసుకొని మిగతా సొమ్మును క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్‌లోని జిబ్రేన్‌ ఖాతాకు మళ్లించేవాడు. జిబ్రేన్‌ తన వద్ద ఉన్న క్లోనింగ్‌ చేసిన క్రెడిట్‌కార్డులతో విద్యార్థుల ఫీజులు చెల్లించే వాడు. అక్కడి బాధితుల ఫిర్యాదుతో పోలీసులు క్రెడిట్‌కార్డు మోసాలను గుర్తించేవారు.  నకిలీ కార్డులతో చెల్లింపులు జరిగినట్టు బయటపడటంతో మరోసారి విద్యార్థుల తల్లిదండ్రులు సెమిస్టర్‌ ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మోసాలచిట్టా వెలుగుచూసింది. నిందితుల ఖాతాలోని రూ.2,71,790 నగదు లావాదేవీలను నిలిపివేశారు. గౌతమ్‌ అడ్మిషన్‌ను విశ్వవిద్యాలయం రద్దు చేసింది. స్వదేశానికి వచ్చి అరెస్టయ్యాడు. కోహీర్కర్‌ నితేష్‌నూ అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని