logo

LRS: ఎల్‌ఆర్‌ఎస్‌పై ముందుకా.. వెనక్కా!

కొత్త ప్రభుత్వం కొలువుదీరిన  నేపథ్యంలో గతంలో హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) మొదలుపెట్టిన అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రక్రియ ముందుకు సాగుతుందా.. నిలిచిపోనుందా అనే విషయంలో కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.

Updated : 08 Dec 2023 08:59 IST

హెచ్‌ఎండీఏలో దరఖాస్తుల పెండింగ్‌
రూ.కోట్లలో ఫీజుల వసూలు.. తప్పని నిరీక్షణ
ఈనాడు, హైదరాబాద్‌

కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో గతంలో హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) మొదలుపెట్టిన అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రక్రియ ముందుకు సాగుతుందా.. నిలిచిపోనుందా అనే విషయంలో కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మధ్యలో ఆగిపోయిన ఎల్‌ఆర్‌ఎస్‌కు ఎన్నికల ముందు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. గతంలో దరఖాస్తు చేసుకొని రూ.10వేల ఫీజు చెల్లించిన లేఅవుట్లకు మాత్రమే ఇది వర్తింపజేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయా లేఅవుట్లలో 10శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ అయి ఉండాలనేది నిబంధన పెట్టారు. ఇలాంటివి హెచ్‌ఎండీఏ పరిధిలో 1337లో లక్షన్నర ప్లాట్లు ఉండగా.. 40,389 రిజిస్ట్రేషన్‌ విభాగం కింద గుర్తించారు. తొలుత వీటికి క్రమబద్ధీకరణకే అనుమతి ఇచ్చారు. రియల్టర్లు ముందుకొచ్చి దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే ఫీజు కింద హెచ్‌ఎండీఏకు రూ.కోట్లలో సమకూరింది. తరువాతి ప్రక్రియగా ప్రొసీడింగ్‌లు జారీ చేస్తే.. వాటి ఆధారంగా ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఈ ధ్రువీకరణ పత్రాలు అందకపోవడంతో ప్రక్రియలో తీవ్రజాప్యం చోటుచేసుకుంది. మధ్యలో సాఫ్ట్‌వేర్‌ ఇబ్బందులతో ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. చాలామంది డబ్బులు కట్టినా, ఇంతవరకు ప్రొసీడింగ్‌లు అందకపోవడంతో హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగం చుట్టూ తిరుగుతున్నారు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్‌ రావడం.. ఏపీవోలు, ఇతర అధికారులు ఆ పనుల్లో తలమునకలవడంతో ఈ దరఖాస్తులు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పటికే డబ్బులు చెల్లించినవారు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణతో పెద్దఎత్తున ఆదాయం వస్తుందని హెచ్‌ఎండీఏ ఆశలు పెట్టుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో పాటు పూర్తి స్థాయిలో మంత్రి, కమిషనర్‌ నియామకం తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని