logo

HYD News నగరానికి చేరిన బంగ్లాదేశ్‌ యువతి.. వ్యభిచారం చేయించిన దంపతులు

డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ అక్రమ మార్గంలో సుమారు రెండు నెలల కిందట భారత్‌లోకి అడుగుపెట్టింది.

Published : 11 Feb 2024 08:48 IST

కేశవగిరి, న్యూస్‌టుడే: డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ అక్రమ మార్గంలో సుమారు రెండు నెలల కిందట భారత్‌లోకి అడుగుపెట్టింది. కోల్‌కతా నుంచి సికింద్రాబాద్‌కు రైల్లో వచ్చి అక్కడి నుంచి తనకు జాబ్‌ ఆఫర్‌ ఇచ్చిన పాతబస్తీ చాంద్రాయణగుట్టలో నివసించే దంపతుల వద్దకు చేరింది. బంగ్లాదేశ్‌ యువతితో వ్యభిచారం చేయిస్తూ దంపతులు డబ్బు ఆర్జించసాగారు. శుక్రవారం బంగ్లా యువతి చెప్పాపెట్టకుండా అత్తాపూర్‌లోని ఓ కస్టమర్‌ వద్దకు వెళ్లడం.. వెంబడించిన దంపతులు ఆమెను పట్టుకోవడం.. గొడవ జరగడం... పోలీసులు రంగప్రవేశం చేయడంతో అసలు బండారం బయటపడింది.

యాప్‌లో కలిసిన బంగ్లాదేశ్‌ యువతి

పాతబస్తీ చాంద్రాయణగుట్ట ఘాజిమిల్లత్‌కాలనీలో షేక్‌ సోనియా(27), మహ్మద్‌ సల్మాన్‌(24) దంపతులు నివసిస్తున్నారు. వస్త్ర దుకాణంలో పనిచేసే మహ్మద్‌ సల్మాన్‌.. షేక్‌ సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ, భారత్‌కు చెందిన వ్యక్తికి పుట్టిన సంతానం. దీంతో కోల్‌కతా నగరంతో షేక్‌ సోనియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశస్థులు పరస్పరం మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా ఒక యాప్‌ ఉంది. ఈ యాప్‌లో షేక్‌ సోనియా చాటింగ్‌ చేస్తుండగా బంగ్లాదేశ్‌ వొర్సిండి మండలం రాయ్‌పూర్‌ గ్రామానికి చెందిన స్రిస్టీ అక్తర్‌(22) పరిచయమైంది. వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో హైదరాబాద్‌లో తనకు డబ్బు సంపాదించేందుకు ఉద్యోగం దొరుకుతుందా అని స్రిస్టీ అక్తర్‌ అడిగింది. ఇళ్లలో పనిచేసే ఉద్యోగమైతే నెలకు రూ.10 వేలు వస్తాయని, వ్యభిచార వృత్తిలోకి వస్తే నెలకు రూ.20 వేలు వస్తాయని షేక్‌ సోనియా చెప్పింది. డబ్బు కోసం తాను ఏపనైనా చేస్తానని స్రిస్టీ అక్తర్‌ వెల్లడించింది. భారత్‌లోకి ఎలా ప్రవేశించాలని అడగ్గా.. ఆ రిస్కు నీవే తీసుకోవాలి.. ఒక వేళ ఇక్కడికి వస్తే తనకు ఫోన్‌ చేయాలని చరవాణి నంబరు ఇచ్చింది. రెండు నెలల క్రితం స్రిస్టీ అక్తర్‌ బంగ్లాదేశ్‌ సరిహద్దులు దాటి అక్రమ మార్గంలో కోల్‌కతాకు చేరింది. అక్కడి నుంచి రైలులో నేరుగా సికింద్రాబాద్‌కు వచ్చి షేక్‌ సోనియాకు ఫోన్‌ చేసింది. దంపతులు వెళ్లి యువతిని చాంద్రాయణగుట్టలోని తమ ఇంటికి తీసుకొచ్చారు. ఆమెతో వ్యభిచారం చేయించడం మొదలు పెట్టారు. స్వయంగా షేక్‌ సోనియా వెంటవెళ్లి స్రిస్టీ అక్తర్‌ను తిరిగి తీసుకొచ్చేది. సోనియా చరవాణి ఆ సమయంలో స్రిస్టీ అక్తర్‌ వద్ద ఉండేది. శుక్రవారం షేక్‌ సోనియా పక్కింట్లోకి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఆమె చరవాణికి కాల్‌ రాగా స్రిస్టీ అక్తర్‌ మాట్లాడింది. అత్తాపూర్‌లోని పిల్లర్‌ నంబరు 150 వద్దకు రావాలని సదరు వ్యక్తి చెప్పడంతో ఆమె ఆటో ఎక్కి అక్కడికి వెళ్లింది. ఇంటికి వచ్చిన షేక్‌ సోనియా తన చరవాణి అక్కడే పడి ఉండడం, స్రిస్టీ అక్తర్‌ కనిపించకపోవడంతో అనుమానపడింది. ఆఖరులో వచ్చిన నంబరుకు కాల్‌చేయగా అత్తాపూర్‌కు వస్తోందని తెలిసింది. వెంటనే దంపతులు వెంబడించగా అత్తాపూర్‌లో స్రిస్టీ అక్తర్‌ కనిపించింది. తమకు చెప్పకుండా ఎందుకు వచ్చావని అడగడంతో వారి మధ్య గొడవ జరిగింది. సోనియా చేతిలోని చరవాణి లాక్కొని యువతి డయల్‌ 100 చేయగా అత్తాపూర్‌ ఏఎస్సై మహ్మద్‌ బుర్హానుద్దీన్‌, మహిళా సిబ్బందితో అక్కడికి వచ్చారు. అసలు విషయం తెలుసుకొని చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు దంపతులతో పాటు యువతిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్రిస్టీ అక్తర్‌కు బంగ్లాదేశ్‌లో భర్త ఆసిఫ్‌ఖాన్‌, ఇద్దరు సంతానం ఉన్నట్లు వెల్లడైంది. ఆసిఫ్‌ఖాన్‌ మేస్త్రీ పనిచేయడంతో డబ్బు సరిపోక ఆమె అక్రమ మార్గంలో దేశ సరిహద్దులు దాటి వ్యభిచార వృత్తిలోకి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని