logo

ధరణిలో తప్పులు.. అన్నదాతకు తిప్పలు

సాంకేతిక కారణాలు, రెవెన్యూ అధికారుల తప్పులతో రైతులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న ధరణి పోర్టల్‌ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Published : 23 Feb 2024 02:38 IST

రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం
రైతుబంధు, రుణాలు రాక అగచాట్లు

ఈనాడు, హైదరాబాద్‌, యాచారం, న్యూస్‌టుడే: సాంకేతిక కారణాలు, రెవెన్యూ అధికారుల తప్పులతో రైతులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న ధరణి పోర్టల్‌ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలోని ఫార్మాసిటీకి సమీపంలో కుర్మిద్ద గ్రామానికి చెందిన రైతులు ధరణి పోర్టల్‌ కారణంగా వారి పొలాలపై హక్కులు కోల్పోయారు. ఈ పోర్టర్‌ రాకముందు రైతుల పట్టా భూములుండగా ఇప్పుడు అటవీశాఖ భూములుగా మారిపోయాయి. ప్రైవేటు పట్టాలుగా మార్చాలని కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఎవరూ స్పందిచడం లేదు. రైతుబంధు, బ్యాంకు రుణాలకు దూరమవుతున్నామని వాపోతున్నారు.

ఫార్మాసిటీ సేకరణకూ అడ్డంకులు...

ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం సేకరించిన రైతుల భూముల్లో మీర్‌ఖాన్‌పేట్‌, కుర్మిద్ద గ్రామాలున్నాయి. కుర్మిద్ద నుంచి మీర్‌ఖాన్‌పేట్‌ మీదుగా కడ్తాల్‌ శ్రీశైలం రహదారి ఉంది. కుర్మిద్దలోని 680 ఎకరాల అసైన్డ్‌ భూమిని ఏడేళ్లక్రితం ప్రభుత్వం సేకరించింది.. ఈ భూములను సాగుచేసుకుంటున్న 200 మందికి ఎకరాకు రూ.7లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఇందులో 52 ఎకరాలకు సరిహద్దులు అస్పష్టంగా ఉండడం, పక్కనే అటవీశాఖ భూములుండడంతో ఈ భూమిని వదిలేశారు. రెండేళ్ల తర్వాత ధరణి పోర్టల్‌లో నమోదు చేసేప్పుడు 52 ఎకరాలను ఆటవీభూముల సర్వేనంబర్లలో కలిపేశారు.


అధికారుల మధ్య వివాదం

యాచారం మండలం తాటిపర్తి సర్వేనం 114, 118, 109లో 2100 ఎకరాలుండగా వీటిని 300 కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. తొలుత ఇవి పట్టా భూములు. తర్వాత అసైన్డ్‌, కొన్నేళ్లకు అటవీ భూములుగా రికార్డుల్లో మారాయి. మూడు దశాబ్దాల నుంచి రైతులు భూమి శిస్తు చెల్లిస్తుండగా ధరణిలో ఈ సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చారు. అటవీ అధికారులు హద్దులు నిర్దారించారు. ఇందులోనే రైతులు సాగు చేసుకుంటున్న వారిలో కొందరికి ఆసైన్డ్‌ భూములుగా పాసు పుస్తకాలు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని