logo

మణిహారం చుట్టూ.. మహా గ్రేటర్!

భాగ్యనగరానికి మణిహారమైన ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు జీహెచ్‌ఎంసీని విస్తరించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా పరిధిలోని  నగరపాలికలు, పురపాలక సంఘాలను కలిపి మహా గ్రేటర్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడానికి అధికారులు  ప్రణాళిక రూపొందిస్తున్నారు.

Updated : 02 Apr 2024 07:56 IST

 బల్దియాను విస్తరించాలని సీఎం ఆదేశం
 ఔటర్‌ లోపల ఉన్న సంస్థల విలీనానికి  కసరత్తు

భాగ్యనగరానికి మణిహారమైన ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు జీహెచ్‌ఎంసీని విస్తరించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా పరిధిలోని  నగరపాలికలు, పురపాలక సంఘాలను కలిపి మహా గ్రేటర్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడానికి అధికారులు  ప్రణాళిక రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రణాళికను వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేయనున్నారు. అనంతరం సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని సీనియర్‌ అధికారి ఒకరు ‘ఈనాడు  ప్రతినిధి’కి  తెలిపారు.  

- ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

మరో అరవై డివిజన్లు..!

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా  సమయం ఉండటంతో ప్రాథమిక నివేదికను ఎన్నికల కోడ్‌ తరువాత సీఎం ముందుంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం బల్దియా పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. దాదాపు 74 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. జనాభా కోటి వరకు ఉంది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలను బల్దియాలో విలీనం చేస్తే జనాభా మరో 60 లక్షల వరకు పెరుగుతుందని అంచనా వేశారు. అదనంగా మరో 50 నుంచి 60 డివిజన్ల వరకు పెరుగుతాయని అధికారులు అంటున్నారు. అప్పుడు డివిజన్ల సంఖ్య 210 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రణాళికనే సీఎం ముందు పెట్టాలని అధికారులు అనుకుంటున్నారు. మహా గ్రేటర్‌ పెద్దగా ఉంటుందని సీఎం భావిస్తే దీన్ని రెండుగా చేయమని ఆదేశించినా అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తామని సీనియర్‌ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. 

ఒకే మాస్టర్‌ప్లాన్‌ ఉండేలా..

2007లో 12 మున్సిపాల్టీలు, 8 గ్రామపంచాయతీలను కలిపి జీహెచ్‌ఎంసీని ఏర్పాటు చేశారు. దాదాపు కోటి జనాభా ఉండగా 150 డివిజన్లను నెలకొల్పారు. ఉన్నంతలో వివిధ రూపాల్లో బల్దియాకు ఆదాయం సమకూరడంతోపాటు ప్రభుత్వం ఇచ్చిన నిధులతో చాలా వరకు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇదే సమయంలో రాజధాని చుట్టుపక్కల ఉన్న ఏడు నగరపాలక సంస్థలు, 21 పురపాలక సంఘాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. రాజధాని పరిధిలో ప్రస్తుతం ఐదు మాస్టర్‌ప్లాన్లు ఉండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఐదింటిని విలీనం చేసి వచ్చే 30 ఏళ్లపాటు అమలులో ఉండే విధంగా ఒకే మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని సీఎం ఆదేశించారు. దీనికి అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.  ఇదే సమయంలో గ్రేటర్‌ను కూడా విస్తరించాలని సీఎం భావించారు. ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న సంస్థలన్నింటిని కలిపి మహా గ్రేటర్‌ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. మూడు నెలల్లో దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించడంతో పురపాలక శాఖ అధికారులు అదే పనిలో నిమగ్నమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని