logo

విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది.

Published : 24 Apr 2024 02:16 IST

పోస్టల్‌, ఈడీసీతో అవకాశం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, పరిగి: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. సాధారణ ప్రజలే కాకుండా పోలింగ్‌ విధులు నిర్వర్తించే సిబ్బంది సైతం ఓటు హక్కును  ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటోంది. లోక్‌సభ నియోజక వర్గ పరిధిలో ఓటు హక్కు కలిగి ఉండి..మరో చోట ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించారు. విధులు నిర్వర్తించే చోట లేదా ఓటు హక్కు కలిగిన ప్రాంతంలో ఓటు చేయడానికి అధికారులు ఈడీసీ (ఎలక్షన్‌ డ్యూటీ సర్టిఫికెట్‌) ద్వారా అవకాశం కల్పిస్తున్నారు.

స్థానం మారినా ఇలా చేయవచ్చు: లోక్‌సభ స్థానంలోని ఏ పోలింగ్‌ కేంద్రంలోనైనా విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఈడీసీ ద్వారా ఓటేయవచ్చు. ఉదాహరణకు వికారాబాద్‌ పట్టణంలో ఓటు హక్కు ఉన్న ఉద్యోగి పరిగి పోలింగ్‌ కేంద్రంలో విధుల్లో ఉంటే..ఈడీసీ ద్వారా అక్కడే ఓటేయొచ్చు. వికారాబాద్‌, పరిగి నియోజక వర్గాలు చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. మరో ఉద్యోగి సంగారెడ్డి జిల్లాలో విధులు చేపడితే..అక్కడ ఓటేసే అవకాశం ఉండదు. ఎందుకంటే లోక్‌సభ స్థానం మారుతుంది. ఈ ఉద్యోగి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, ఇతర పోలింగ్‌ అధికారులతో పాటు సూక్ష్మ పరిశీలకులు, వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లు విధుల్లో పాల్గొంటారు. వీరందరూ ఈడీసీ లేదా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది.

ఫారం 12ఏ సమర్పించాలి

ఈడీసీ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే వారు ఫారం-12ఏను తప్పులు లేకుండా పూరించి, ఎన్నికల విధుల వివరాలను జతపరిచి సంబంధిత సహాయ రిటర్నింగ్‌ అధికారి (ఏఆర్‌వో)కు అందించాలి. వారు పరిశీలించి రిటర్నింగ్‌ అధికారికి పంపిస్తారు. అన్ని అంశాలు సరిగ్గా ఉన్నాయని ధ్రువీకరించుకున్న రిటర్నింగ్‌ అధికారి ఈడీసీ జారీ చేస్తారు. వికారాబాద్‌ జిల్లాలో 6200 వేల మందితో పాటు పోలీసు సిబ్బంది 1200 మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఓటుహక్కు ఉపయోగించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని