logo

ఆరేళ్లుగా ఉపాధి కరవు

వలసల నివారణకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కోసం ఆరేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఆ కుటుంబాలకు పనులు కల్పించడం లేదు.

Published : 20 Apr 2024 04:40 IST

సారంగాపూర్‌, న్యూస్‌టుడే: వలసల నివారణకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కోసం ఆరేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఆ కుటుంబాలకు పనులు కల్పించడం లేదు. బీర్‌పూర్‌ మండల కేంద్ర శివారు గ్రామమైన మోతీనగర్‌, సిరిపూర్‌, గంగసముద్రం గతంలో పునరావాస గ్రామంగా కొనసాగింది. అయా గ్రామాలు ధర్మపురి మండలంలోని గాదేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేవి. వసతులు సరిగా లేకపోవడంతో గ్రామాల్లోని ప్రజలు వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇందులో దాదాపు 50 మోతీనగర్‌ కుటుంబాలు అక్కడే నివాసం ఉండగా ఆరేళ్ల కిందట బీర్‌పూర్‌ పంచాయతీలో విలీనం చేశారు. ఓటుహక్కు, ఇంటి పన్నులు, అనుమతులన్నీ బీర్‌పూర్‌ నుంచే అమలవుతున్నా ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డులు మాత్రం గాదేపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నాయి. ఉపాధి జాబ్‌కార్డుల ఆధారంగా పనుల కోసం దరఖాస్తు(డిమాండ్‌) తీసుకోవడంలేదు. ఫలితంగా ఆరేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగుతున్నప్పటికీ మార్చకపోవడంతో ఉపాధి పనులకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మండల రెవెన్యూ, మండల పరిషత్తు, వ్యవసాయాధికారి, ఎంఈవో కార్యాలయాలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మోతీనగర్‌ ప్రాంతంలోనే కొనసాగుతున్నాయని, ఉపాధి పనులు మాత్రం కల్పిచడంలేదంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఉపాధి హామీ పథకం పనులు కల్పించేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో లచ్చాలును వివరణ కోరగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేలా చూస్తానని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు