logo

తండ్రి సైనికుడు.. తనయుడు తీవ్రవాది

బ్రూక్‌ఫీల్డ్‌ రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌లో అరెస్టు చేసిన అనుమానిత తీవ్రవాదులు ముసావిర్‌ హుసేన్‌ శాజిబ్‌, అబ్దుల్‌ మతీన్‌ అహ్మద్‌ తాహాలను జాతీయ తనిఖీ దళం (ఎన్‌ఐఏ) కోరమంగలలోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరచింది.

Updated : 14 Apr 2024 10:30 IST

‘రామేశ్వరం కేఫ్‌’ కేసులో ఎన్‌ఐఏ విచారణ  

అనుమానిత తీవ్రవాదులు. ఎవరూ గుర్తు పట్టకుండా ఇలా గుండు, తలకట్టు  చేయించుకున్నారు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : బ్రూక్‌ఫీల్డ్‌ రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌లో అరెస్టు చేసిన అనుమానిత తీవ్రవాదులు ముసావిర్‌ హుసేన్‌ శాజిబ్‌, అబ్దుల్‌ మతీన్‌ అహ్మద్‌ తాహాలను జాతీయ తనిఖీ దళం (ఎన్‌ఐఏ) కోరమంగలలోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరచింది. పది రోజులు వారిని విచారించేందుకు న్యాయమూర్తి అనుమతి మంజూరు చేశారని ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు వీరు ప్రణాళికను రూపొందించుకున్నారు. బాంబుల తయారీ, పేలుడు అనంతరం తప్పించుకోవడం, ప్రమాణించే మార్గాల పటాల రూపకల్పన తదితరాల్లో వీరిద్దరూ సిద్ధహస్తులని గుర్తించారు. నిందితులను విచారించేందుకు మడివాళలోని ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలో ప్రత్యేక సెల్‌ను సిద్ధం చేశారు. ట్రాన్సిట్ వారెంట్పై వారిని తీసుకు వచ్చారు. భద్రత నడుమ న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. చెన్నైలో విఘ్నేశ్‌, మహ్మద్‌ జునైద్‌ సయ్యద్‌, సంజయ్‌ అగర్వాల్‌, ఉదయ్‌ దాస్‌, కోల్‌కతాలో అన్మోల్‌ కులకర్ణి, యశు శహనవాజ్‌ పాటిల్‌ తదితర పేర్లు పెట్టుకుని ముసావిర్‌ తిరిగాడు. నకిలీ ఆధార్‌ కార్డును చేయించుకున్నాడు. నిందితులు కోల్‌కతాలో 12 రోజుల పాటు రోజుకో ప్రదేశంలో తలదాచుకుంటూ వచ్చారు. అబ్దుల్‌ మతీన్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు. తండ్రి దేశం కోసం సైనికుడిగా సేవలందించారు. అనారోగ్యంతో గత ఏడాది ఆయన మరణించారు. మంగళూరు కుక్కర్‌ బాంబ్‌ పేలుడు, శివమొగ్గ వద్ద బాంబు పేలుడు ఘటనల వెనుక మాస్టర్‌ మైండ్‌ ఇతడేనని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని