logo

స్వార్థ ప్రయోజనాలకే పార్టీ మారుతున్నారు: సత్యవతి రాథోడ్‌

భారాస నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహబూబాబాద్‌ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నడికుడిలో శుక్రవారం నిర్వహించారు.

Published : 13 Apr 2024 03:32 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: భారాస నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహబూబాబాద్‌ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నడికుడిలో శుక్రవారం నిర్వహించారు. అనంతరం విలేకరులతో సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ తాతా మధు, భారాస అభ్యర్థి మాలోత్‌ కవిత మాట్లాడారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును నియోజకవర్గ భారాస నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి గెలిపించారని, చివరకు వారిని నట్టేట ముంచి ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారని విమర్శించారు. ఎమ్మెల్యే వెంకట్రావు సొంత మండలం దుమ్ముగూడెంలో నిర్వహించిన సమావేశానికి భద్రాచలం నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో భారాస శ్రేణులు తరలివచ్చాయని పేర్కొన్నారు. పార్టీ  అభ్యర్థి మాలోత్‌ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చి ఆ పథకాలను అమలు చేయడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు రాజకీయ కక్షతోనే భారాస అధినేత కేసీఆర్‌పై లేనిపోని  ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. భాజపా ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాంనాయక్‌ కాలం చెల్లిన నాయకులు అని అభివర్ణించారు. గతంలో వీరిద్దరూ ఎంపీగా గెలిచినా అభివృద్ధి  శూన్యమని విమర్శించారు. ఖమ్మం ఎంపీ సీటును తమ కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల  ఎవరికివారే ప్రయత్నాలు చేస్తున్నారని ఆక్షేపించారు. కేసీఆర్‌ను ఓడించి తప్పు చేశామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని, ఇప్పటికే కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత మొదలైందని తెలిపారు. సమావేశంలో భారాస నియోజకవర్గ   సమన్వయ కమిటీ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్‌, మానే రామకృష్ణ, సాగి  శ్రీనివాసరాజు, ఎంపీపీ   రేసు లక్ష్మి, అన్నె సత్యనారాయణమూర్తి, కణితి రాముడు, ఎండీ.జానీపాషా, కొత్తూరి సీతారామారావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని